రామోజీరావు స్పూర్తంటున్న దర్శకనిర్మాత!
రామోజీరావు తనకు స్పూర్తంటూ తెలంగాణ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్ చెప్పారు. ఇటీవలే ఆయన్ను నిర్మాతల మీటింగ్లో కలిశాను. ఆయన్నుంచి ఎంతమంది స్పూర్తి పొందారో కానీ.. నేను ఆయన ప్రసంగం, ఆయన ఆలోచన విధానం విని ఆశ్చర్యపోయాయని తెలియజేశాడు. నేటి సినిమాలన్నీ నాలుగేసి సినిమాల అతుకులబొంతగా ఆయన పేర్కొనడం కరెక్టే అనిపించింది. ఆయన్ను ఇన్స్పైర్గా తీసుకుని ఇప్పుడు సాయి వెంకట్ గ్లోబల్ మీడియా పతాకంపై ఒకేసారి పది చిత్రాలు నిర్మించాలని నిర్ణయించానని చెప్పారు.
బుధవారం నాడు ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ... కొత్తవారికి అవకాశాలు కల్పించేందుకే ఈ సినిమాలు తీస్తున్నానీ, పది సినిమాల నిర్మాణం, ఆడియోలు, విడుదలలు కూడా ఒకేసారి జరుగుతాయని అన్నారు. ఆగస్టు ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభిస్తామనీ, మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామనీ, ఇది కేవలం అవార్డు కోసమే తీస్తున్నానని ప్రకటించారు. గతంలో ఈయన యువకులు, గల్లీ కుర్రోళ్లు, నీతోనే, నేనున్నాను వంటి చిత్రాలు తీశారు.
ఛాంబర్పై తెలంగాణ నాయకుల నజర్!
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో ఫిలింనగర్లోని ఛాంబర్ కార్యాలయం, కల్చరల్ క్లబ్ వాటిపై తెలంగాణ ప్రభుత్వం నజర్ వేసింది. గత కొంతకాలంగా ఆంధ్రావాళ్ళు ఇక్కడి ప్రాంతాన్ని కబ్జా చేశారంటూ కొందరు తెలంగాణావాదులు వాపోతున్నారు. తాజాగా... బుధవారం నాడు తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిసరాలను తెలంగాణా మంత్రులు, కలెక్టర్, ఉన్నతాధికారులు పరిశీలించారు.
ఛాంబర్లో అక్రమంగా కట్టిన సెకండ్ ఫ్లోర్తోపాటు, కిందిభాగంలో కమర్షియల్ కాంప్లెక్స్కు అనుమతులు ఇవ్వడంపై ఆరా తీశారు. ఒకే వ్యక్తికి రెండు, మూడు, నాలుగు షాపులు వుండటంపై తెలంగాణ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు వ్యక్తులు ఎవరూ కన్పించకపోవడంతో బినామిగా వున్నవారు అక్కడికి వచ్చి వివరణ ఇవ్వడంతో సమస్య మరింత జటిలంగా కన్పించింది. త్వరలో దీనిపై ఓ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు సుధాకర్రెడ్డి, ఆచంట గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.