'బాహుబలి' రెండో భాగం హిందీ వెర్షన్ రూ.150 కోట్లు.. నిజమా? నిర్మాతలేమంటున్నారు!
రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమా దక్షిణ భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. హిందీ వెర్షన్లో సుమారు 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం కంటిన్యూషన్ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన బిజినెస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం పట్ల 'బాహుబలి' నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
'బాహుబలి'కి వచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకుంటూ.. రెండో పార్ట్ని కూడా అమ్మాలని నిర్ణయించుకున్నారు. బాలీవుడ్కు చెందిన ఓ పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.. 'బాహుబలి' పార్ట్ 2కు సంబంధించి హిందీ హక్కులను సుమారు రూ.150 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఫిలింనగర్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే కరణ్ జోహార్కే ఈసారి కూడా ఈ సినిమా ఇద్దామా అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు చెప్తున్నారు. దాంతో డీల్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకుంటున్నారు.
ఒకవేళ రూ.150 కోట్ల డీల్ కుదిరితే మాత్రం, దక్షిణ భారతదేశంలో అత్యధిక ధర పలికిన అనువాద చిత్రంగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కేరళలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 2017లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఏదేమైనా వరుస రికార్డులు సృష్టిస్తున్న 'బాహుబలి' మరో విజయాన్నిసొంతం చేసుకునేందుకు రెడీగా ఉంది.