'శ్రీమంతుడు' చూడబోతున్న సచిన్ టెండూల్కర్... కొత్తగా 'శ్రీమంతుడు'కి రెండు అతుకులు
మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని సచిన్ టెండూల్కర్ చూడనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు తెలియజేశారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కొత్తగా జత చేస్తున్నారు. అవి శుక్రవారం నుండి అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం మూడవ వారం దాటినా ఈ రోజుకి కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ను పెంచడానికి చిత్ర బృందం సినిమా ఎడిటింగ్లో తీసేసిన కొన్ని సీన్లను తిరిగి జత చేయనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. విమర్శకులు కూడా ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదని రాసారు. దాంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. అయితే 'శ్రీమంతుడు' థియేట్రికల్ ట్రైలర్లో ఉన్న రెండు సీన్లను నిడివి కారణంగా తీయాల్సివచ్చింది. ఆ సీన్లను యాడ్ చేయమని మమ్మల్ని చాలామంది అడిగారు. మాకు కూడా ఆ సీన్స్ను జోడిస్తే ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేస్తారనిపించింది. సెన్సార్ కంప్లీట్ చేసిన ఆ రెండు సీన్స్ శుక్రవారం అన్ని థియేటర్లలో ప్రదర్శింపజేస్తున్నామని చెప్పారు.
నిర్మాతల్లో ఒకరైన నవీన్ మాట్లాడుతూ ''మా మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. దీనికి కారకులైన మహేష్, కొరటాల శివకు థ్యాంక్స్. రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూసారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూడనున్నారు'' అని చెప్పారు.