పవన్ మేనల్లుడు 'తిక్క'... తెలంగాణ మంత్రి స్విచాన్...
'నాకు తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ.. పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్లోని పదాన్ని ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెట్టుకున్నాడు. శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా తెలంగాణా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. లారిస్సా బోనేసి హీరోయిన్గా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.
హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ''ఇది నా నాలుగవ చిత్రం. చాలా సంతోషంగా ఉంది. 2014 జూలైలో ఈ సినిమా కథ విన్నాను. కొత్తగా అనిపించింది. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అవ్వడంతో హీరోకు తిక్క రేగుతుంది. అందుకే సినిమాకు 'తిక్క' అనే టైటిల్ పెట్టారు. తన ప్రేమను మరలా తిరిగి ఎలా సాధించాడు అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు.
దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ''ఎవరి జీవితానికి వాడే హీరో. కాని ఈ సినిమాలో హీరో లైఫ్కు తనే విలన్. ఇదొక కామెడీతో కూడిన ఫిలిం. ఆగస్ట్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. డిసెంబర్లో షూటింగ్ పూర్తిచేసి, జనవరిలో పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.