Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..
తమిళ నటుడు సంతానం వివాదంలో చిక్కుకున్నాడు. హారర్ కామెడీ చిత్రం డీడీ నెక్ట్స్ లెవల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఈ చిత్రంలోని కిస్సా 47 పాట తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిస్సా 47 పాటలో వాడిన 'గోవింద గోవింద' అనే పదాలు తిరుపతి ఏడుకొండలలో భక్తులు ఆరాధించే శ్రీవారి అవమానించేలా ఉందని, భక్తి గీతాలలో ఉపయోగించే పవిత్రమైన పదాలకు అవమానకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంకా పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ఆ పాటను సినిమా నుండి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పాటను తొలగించకపోతే రూ. 100 కోట్ల పరిహారం చెల్లించాలని రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివాదంపై తాజాగా నటుడు సంతానం స్పందించారు. తాము ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా తీయలేదన్నారు. అలా ఉంటే తమకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదన్నారు.
సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగానే సినిమాను రూపొందించామని, ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తాము రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆరోపణలు చేసే వారిని ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చారు.