శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 19 జులై 2017 (02:41 IST)

వర్షాన్ని చూస్తున్న అనుభూతి ఫిదా...చూసిన ఏ ఒక్కరు వ్యతిరేకించరన్న దర్శకుడు

ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ముల తీసిన రెండు సినిమాలు డబ్బు చేసుకోలేదు. అలాగని ఫ్లాఫ్ కూడా కాదు. కానీ కొంతమంది నిర్మాతలు ఆయనను, ఆయన కథను ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే బాపు, విశ్వనాథల తర్వాత కళాత్మకమైన సినిమాను కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా, చూసి ఆనందిం

ఈ మధ్యకాలంలో శేఖర్ కమ్ముల తీసిన రెండు సినిమాలు డబ్బు చేసుకోలేదు. అలాగని ఫ్లాఫ్ కూడా కాదు. కానీ కొంతమంది నిర్మాతలు ఆయనను, ఆయన కథను ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే బాపు, విశ్వనాథల తర్వాత కళాత్మకమైన సినిమాను కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా, చూసి ఆనందించేలా చేయండంలో శేఖర్ అద్వితీయ ప్రతిభ కలవాడు. ఒక రాష్ట్రం రెండుగా విడిపోతున్నప్పుడు కలుగుతున్న విద్వేష వాతావరణంలో ఏ ప్రాంతంవారైనా మనుషులు వాళ్ల సమస్యలు, వాళ్ల ఆరాటాలు, ఉద్వేగాలు ఒకటే అనే విషయాన్ని తెబుతూ తాను తీసిన లో బడ్జెట్ సినిమాకు కాసులు రాల్లేదు కాని ఈ రోజుకీ టీవీల్లో ఆ సినిమా వస్తే చానెల్ మార్చడం కుటుంబ సబ్యులకు కష్ట సాధ్యం. 
 
దిల్ రాజు వంటి అభిరుచి కలిగిన దర్శకుడు అందుకే ఆయనను నమ్మాడు. నమ్మి సినిమా టేకింగ్‌లో చిన్న పాత్ర కూడా తీసుకోకుండా మొత్తం సినిమాను ఆయన చేతుల్లో పెట్టాడు. ఫలితం మన కళ్లముందు కమనీయ కావ్యం మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఫిదా. చిత్తడిజల్లుల్లో కమ్మటి కాఫీని ఆరుబయట నిల్చుని తాగినప్పుడు కలిగే పరమానందానుభూతిని ప్రతి ప్రేక్షకుడూ పొందుతాడని నిర్మాత, దర్శకుడు ఇద్దరూ హామీ ఇస్తున్నారు. 
 
ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘తెలంగాణ అమ్మాయికి, అమెరికాలో మెడికో చేస్తున్న ఓ అబ్బాయికి మధ్య జరిగే ఓ ప్రేమకథ ఈ చిత్రం. వాళ్ల పరిచయం ఎలా మొదలైంది. వాళ్లిద్దరూ కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిది అన్నదే ఈ సినిమా. ఇది చాలా కవితాత్మకంగా ఉంటుంది. ఓ వర్షాన్ని చూస్తున్న అనుభూతినికలిగించే సినిమా ఇది. 
 
ఈ మధ్య వస్తున్న ప్రేమకథలతో పోలిస్తే ‘ఫిదా’ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. నేను ఇప్పటికే నాలుగు సార్లు చూశాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒకటికి రెండు సార్లు చూడాలనుకుంటారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు చాలా బలంగా ఉంటాయి. వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి ఆయా పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. వాళ్లు తప్ప ఇంకెవ్వరూ న్యాయం చేయలేరన్న స్థాయిలో నటించారు. ప్రతి అమ్మాయి సాయి పల్లవి పాత్రను చూసి తనను తాను గుర్తు చేసుకుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పాత్రను ప్రేమిస్తారు.’
 
‘నాదీ దిల్‌రాజుది వేర్వేరు స్కూళ్లు. ఆయన సినిమా నిర్మాణ పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాతో సినిమా చేద్దామని ఆయనే వచ్చారు. ఈ సినిమా విషయంలో ఎక్కడా కలగజేసుకోలేదు. స్క్రిప్టు సమయంలో ఒకటి రెండు సలహాలు ఇచ్చారు తప్ప .. ఒక్కసారి స్క్రిప్టు పూర్తయ్యాక ఎక్కడా మార్పులు చెప్పలేదు. సెట్‌కి కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారంతే.’
 
తనదైన కవితాత్మకతో అచ్చమైన తెలుగు సినిమాను వెండితెరపై ఆవిష్కరిస్తారాయన. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్‌’ వంటి చిత్రాలు ఆయనలోని దర్శకత్వ ప్రతిభను చాటిన మచ్చుతునకలు. తాజాగా వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా ‘ఫిదా’ రూపొందించారు. స్టార్‌ హీరోలు మారితే అప్పుడు ప్రేక్షకులకు ఇంకా మంచి కథలు అందివ్వగలుగుతాం అంటున్న శేఖర కమ్ముల సత్యాన్ని కూడా సుతిమెత్తగానే చెబుతున్నారు. ఇలాంటి దర్శకులను బతికించి తామూ బతకగల నిర్మాతలు, మనసున్న నిర్మాతలు, హృదయం పూర్తిగా వ్యాపారంతో నిండిపోని నిర్మాతలు మనకు కావాలిప్పుడు. 
 
జూలై 21. తెలుగు వెండితెరపై మరో దృశ్యకావ్యం. కంటికి కనువిందు చేసే గొప్ప సినిమా.. మన ముందుకొస్తోంది. వదలొద్దు. నాలుగు చెత్తసినిమాలు చూసి విసుక్కోడానికి బదులు ఒంటికి కాకుండా మనసుకు ఆనందం కలిగించే సినిమా ఇది.. మిస్ కాకండి. ఆదరించండి.. శేఖర్ కమ్ములను నమ్మిన నిర్మాతను బతికించండి.