450 కేంద్రాల్లో స్వదేశ్ గ్రూప్ ఆఫ్ కంపనీస్ థియేటర్లు!
ఆంధ్ర, తెలంగాణాల్లో థియేటర్లు నిర్మించేందుకు స్వదేశ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుకు వచ్చింది. ఏకంగా 450 థియేటర్లు నిర్మించబోతోంది. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారంనాడు హైదరాబాద్లో ప్రకటించారు. ఈ సందర్భంగా మోడురి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. సుమారుగా 450 కేంద్రాల్లో థియేటర్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం.
ప్రతి ప్రాంతంలో ఒక మాల్లో భాగంగా కనీసం రెండు స్క్రీన్స్ను నిర్మించాలనుకుంటున్నాం. అలానే సినిమాల నిర్మాణం కోసం 1000 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను కేటాయిస్తున్నాం. ఔత్సాహికులను ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఉన్న థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. ఉన్న థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. వీటి సంఖ్యను పెంచాలని ప్లాన్ చేస్తున్నాం.
అలానే పూణేలో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్ మాదిరి హైదరాబాద్లో సకల వసతులతో కూడిన ఫిలిం ఇన్స్టిట్యూట్ను స్థాపించాలనుకుంటున్నాం. 'ఇంటిగ్రేటెడ్ ఫిలిం ట్రైనింగ్ సెంటర్' అనే ఈ ప్రపోజల్స్ను తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలను కలిసి వారందరితో కలిసి అడ్వైజరీ కమీటీను ఏర్పాటు చేస్తాం. జూలై 1 నుండి మా సంస్థ ఈ కార్యకలాపాలన్నింటినీ మొదలుపెట్టనుంది'' అని చెప్పారు.