ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మే 2020 (10:20 IST)

లైట్స్ - కెమెరా - యాక్షన్ : చెన్నైలో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభం

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యే నగరాల్లో ఒకటైన చెన్నై మహానగరంలో బుల్లితెర సీరియళ్ళ షూటింగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, షూటింగుల సమయంలో గరిష్టంగా 60 మందికి మించి ఉండరాదని పేర్కొంది. 
 
కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రకాల షూటింగులు బంద్ అయిన విషయం తెల్సిందే అయితే, నాలుగో దశ లాక్డౌన్‌ మే 31వ తేదీతో ముగియనుంది. ఐదో దశ లాక్డౌన్ జూన్ ఒకటో తేదీన ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ దశలో అనేక సడలింపులు ఇచ్చారు. 
 
దీంతో చెన్నై టీవీ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతోంది. టీవీ సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గరిష్టంగా 20 మందితో షూటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అంత కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.
 
వారి విజ్ఞప్తిని పరిశీలించిన ముఖ్యమంత్రి శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తప్పనిసరని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నుంచే షూటింగులు నిర్వహించుకోవచ్చని ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు.