శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 నవంబరు 2018 (20:23 IST)

పాత్ర కోసం రక్తం చిందించారు... ముక్కు చెవులు కుట్టించుకున్న హీరో...

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో అమీర్ ఖాన్ ఒకరు. ఈయన సినిమా పాత్ర కోసం ప్రాణమిస్తారు. అలాంటిది... ఒక పాత్ర కోసం ఏకంగా తన రక్తాన్ని చిందించారు. అంటే.. ముక్కు చెవులు కుట్టించుకున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తన సినీ కెరీర్‌లో వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ అలరిస్తున్న ఆయన ఈ దీపావళి సందర్భంగా 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షైయిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సుమారుగా రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. అజయ్‌ అతుల్‌, జాన్‌ స్టీవర్ట్‌లు సంగీతం సమకూర్చారు.
 
ఇప్పటికే ట్రైలర్‌తో సహా సినిమాకు సంబంధించిన ఆసక్తికర మేకింగ్‌ వీడియోలను పంచుకుంటున్న చిత్ర బృందం తాజాగా చాప్టర్‌-10 పేరుతో మరో వీడియోను పంచుకుంది. ఇందులో ఆమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. 'తొలిసారి స్క్రిప్ట్‌ వినగానే ఫిరంగి పాత్ర నాకెంతో నచ్చింది. ఎందుకంటే అతను(ఫిరంగి) అంత నమ్మకస్తుడైన వ్యక్తికాదు. ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటాడు. ఫిరంగి లాంటి వ్యక్తి గురించి నాకస్సలు తెలియదు. కానీ, ఫిరంగిలాంటి వ్యక్తులు మనందరిలోనూ ఉంటారు' అని వివరించారు. 
 
అలాగే, చిత్ర దర్శకుడు విజయ కృష్ణ ఆచార్య స్పందిస్తూ, ఫిరంగి పాత్ర కోసం ఆమీర్‌ ముక్కు, చెవులు కుట్టించుకున్న సందర్భాన్నీ ఇందులో చూపించారు. ముక్కు కుట్టినప్పుడు రక్తం కూడా వచ్చింది. ఆమీర్‌ ఈ సినిమా కోసం నిజంగా రక్తాన్ని చిందించారు అంటూ దర్శకుడు విజయ్‌ కృష్ణ ఆచార్య చెప్పుకొచ్చారు.