శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (13:05 IST)

అతిలోక సుందరి దివికేగి ఏడాది అయ్యింది.. నా నవ్వులోనే..

అతిలోక సుందరి దివికేగి సంవత్సరం అయ్యింది. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఎమిరేట్ టవర్స్‌లో తీవ్ర గుండెనొప్పితో.. బాత్ టబ్‌లో పడి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తిరిగి రానిలోకాలకు చేరిందనే వార్త యావత్తు సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. 
 
అతిలోక సుందరిగా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శ్రీదేవి తన నటనతో ఎన్నో అవార్డులను అందుకుంది. భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా... నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి.
 
అలాగే 1996 జూన్‌లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. వీరికి జాన్వి, ఖుషీఅనే ఇద్దరు కుమార్తెలున్నారు. వివాహానంతరం సినిమాకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి 2012లో ''ఇంగ్లీష్ వింగ్లీష్'' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో ''పులి'', హిందీలో ''మామ్'' ఆమెకు చివరి చిత్రాలు. ఆమె దివికేగినా.. చిరస్థాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ప్రస్తుతం శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ దడఖ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. 
 
తాజాగా శ్రీదేవి తొలి వర్ధంతిని పురస్కరించుకుని కుమార్తె జాన్వి కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. తన హృదయం ఎప్పుడూ భారంగానే వుంటుంది. కానీ తాను నవ్వుతూనే వుంటాను. ఎందుకంటే.. ఆ నవ్వులోనే నువ్వున్నాన్ అని పోస్టు చేసింది. 
 
ఈ సందర్భంగా తన తల్లి చెయ్యిపట్టుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది జాన్వీ. పలువురు సినీ ప్రముఖులు కూడా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అభిమానులూ ఆమెను స్మరించుకుంటున్నారు. 
 
గతేడాది మేనల్లుడి వివాహం నిమిత్తం కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిన శ్రీదేవి.. అక్కడి ఓ హోటల్లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన సంగతి తెలిసిందే.