ట్రైలర్స్ విడుదల చేసిన 'పాఠశాల' నిర్మాత, దర్శకులు
'విలేజ్లో వినాయకుడు', కుదిరితే ఒక కప్పుకాఫీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన మహి వి.రాఘవ దర్శకుడిగా మారి 'పాఠశాల' చిత్రాన్ని రూపొందించారు. అంతా కొత్తవారితో నిర్మించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి, పవన్కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు పాల్గొన్నారు.
ముందుగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... సంస్కృత పదం నుంచి పుట్టింది పాఠశాల. అంటే నేర్చుకోవడమని అర్థం. కాలేజీ చదువు తర్వాత ఐదుగురు స్నేహితులు తమ ప్రయాణంలో ఏం నేర్చుకున్నారు? జీవితానికి ఏవిధంగా ఉపయోగడిందనేది సినిమా. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.
ట్రైలర్స్ ఆవిష్కరణలో పాల్గొన్న దర్శకుడు దేవకట్టా మాట్లాడుతూ... డిగ్రీ చదివిన తర్వాత కాలేజీ ట్రిప్ చాలా సరదాగా ఉందనీ, తన జీవిత ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్, చెన్నై, యు.ఎస్.ఎ. ఇలా పలుచోట్ల చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. దర్శకురాలు నందినిరెడ్డి తెలుపుతూ.... కాలేజీ అయ్యాక... హమ్మయ్యా! ఇక పరీక్షలు రాయాల్సిన పనిలేదనిపించింది. కానీ దర్శకురాలు అయ్యాక ప్రేక్షకుల పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
మరో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణంలో అనుభవాలు, అనుభూతులు చాలా వుంటాయనీ, వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ట్రైలర్స్ చూశాక.. హ్యాపీడేస్ సీక్వెల్ వస్తుందనే అభిప్రాయాన్ని మరో దర్శకుడు ప్రవీణ్ సత్తారు వ్యక్తం చేశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాతలు వ్యక్తం చేశారు.