గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (20:51 IST)

మారుతీ కథతో 'భలే మంచి చౌక బేరమ్‌'... లవ్ ట్రాక్ తప్పింది కానీ...

దర్శకుడు మారుతీ కాన్సెప్ట్‌ ఇచ్చిన ఈ చిత్రంలో నూతన దర్శకుడు మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

భలే మంచి చౌక బేరమ్ నటీనటులు : నవీద్‌, 'కేరింత' నూకరాజు, యామిని భాస్కర్‌, రాజీరవీంద్ర తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : బాల్‌ రెడ్డి, సంగీతం : హరి గౌర, దర్శకత్వం : మురళీకష్ణ ముడిదాని.
నిర్మాతలు : ఆరోళ్ళ సతీష్‌ కుమార్‌.
 
కథ :
పార్థు (నవీద్‌), సలీమ్‌ (నూకరాజు) స్నేహితులు. ఉద్యోగం కోసం దుబాయ్‌కి వెళ్లే క్రమంలో.. ఓ దళారీ చేతిలో మోసపోతారు. తిరిగి ఇంటికెళ్ళలేక హైదరాబాద్‌లో కొరియర్‌ బాయ్‌గా, కారు డ్రైవర్‌గా గడిపేస్తుంటారు. మరోపక్క మాజీ ఆర్మీ మేజర్‌ (రాజా రవీంద్ర) భారతదేశ రహస్యాలు అనే ఫైల్‌ రాసి దాన్ని అమ్మేయాలని చూస్తాడు. చిత్రమైన స్థితిలో ఆ ఫైల్‌ కొరియర్‌ బాయ్‌ సలీమ్‌(నూకరాజు)కి దొరుకుతుంది. ఇద్దరూ కలిసి దాన్ని పాకిస్తాన్‌కు అమ్మేస్తే జీవితం బిందాస్‌గా వుంటుందని భావించి ఇక్కడ ముఠాతో బేరాలు కుదుర్చుకుంటారు. 
 
అలా వెళ్ళి నేరుగా పాకిస్థానీ టెర్రరిస్ట్‌ అస్లమ్‌ బాయ్‌తో డీల్‌ ఫిక్స్‌ అవుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో రాజా రవీంద్రకి తన ఫైల్‌ వీరిద్దరి దగ్గర వుందని తెలిసి వారిని పట్టుకుంటాడు. ఫైనల్‌గా ముగ్గురూ ఆ టెర్రరిస్టు దగ్గరకు వెళ్ళి 30 కోట్లకు బేరం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ
పార్థు పాత్రలో నవీద్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కీలక సన్నివేశాలు, క్లైమాక్స్‌లో బాగా నటించాడు. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర అయిన సలీం పాత్రలో నటించిన నూకరాజు తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా బాగానే నవ్వించాడు. ఒక దశలో చిరాకు పెట్టిస్తాడు కూడా. సీనియర్‌ నటుడు రాజా రవీంద్ర చాలాకాలం తరువాత ఈ సినిమాలోనే పూర్తిస్థాయి పాత్రలో నటించారు. ఈ ముగ్గురి కలయికలో వచ్చే సన్నివేశాలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. హీరోయిన్‌ పాత్రలో పార్థుకు ప్రియురాలుగా ఆదర్శీ (యామిని భాస్కర్‌) నటన పరంగానే కాకుండా, తన లుక్స్‌ అండ్‌ గ్లామర్‌ పరంగానూ బాగా ఆకట్టుకుంటుంది.
 
మొదటిభాగం సరదాగా సాగిపోయినా.. ద్వితీయభాగంలో అసలు కథ మొదలవుతుంది. దేశ భక్తి గురించే వివరించే ఎపిసోడ్‌ కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తోంది. కొత్త దర్శకుడు మురళీకృష్ణ సినిమాలోని కీలక సన్నివేశాలను బాగానే డీల్‌ చేశాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. దర్శకుడు మంచి కథను తీసుకున్నా దాన్ని తీర్చిదిద్దిన తీరు కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు ఇంకొంచెం బలమైన పాత్రలను రాసుకోవాల్సింది. ఇక టెర్రరిస్టులతో వచ్చే సన్నివేశాలు అంత పవర్ఫుల్‌‌గా అనిపించవు. 
 
విలన్‌ పాత్రను కూడా ఇంకొంచెం హైలైట్‌ చేయాల్సింది. సెకండ్‌ హాఫ్‌‌లో వినోదం పంచుతూ సందేశాన్ని ఇచ్చిన తీరు బాగున్నా ఫస్ట్‌ హాఫ్‌‌కు వచ్చేసరికి ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మినహా అలాంటి హైలైట్‌ ఎపిసోడ్‌ ఒక్కటికూడా ఉండదు. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించదు. ఇక ఫస్ట్‌ హాఫ్‌లో నూకరాజు చేసే కామెడీ కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది. సెకండ్‌ హాఫ్‌‌లోలా ఫస్ట్‌ హాఫ్లో బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే ఈ చిత్రం ఫలితం ఇంకోలా ఉండేది.
 
తొలి సినిమాకు దర్శకత్వం వహించినా మురళీకృష్ణ చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పాడు. ఆ క్రమంలో కొద్దిగా కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేయడంలో సఫలం అయ్యాడు. లాజిక్‌ల గురించి పట్టించుకోకుండా ఆయన కథ నడిపిన తీరు చాలావరకు ఆకట్టుకుంది. కథను ఇంకొంచెం పకడ్బందీగా రాసుకొని ఉంటే ఈ చిత్రం ఆయనకు మంచి విజయాన్ని అందించేది. హరి అందించిన సంగీతం పర్వాలేదు. సినిమాలో వున్న మూడు పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ఉద్దవ్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. బాల్‌ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం సినిమాకు రిచ్‌ లుక్‌ను తీసుకొచ్చింది. ఆరోళ్ళ సతీష్‌ కుమార్‌ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. బి.సి ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటాయి.
 
- మురళీ కృష్ణ పెండ్యాల