మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (11:57 IST)

రంగస్థలం ఆది పినిశెట్టి.. ''నీవెవరో'' అంటున్నాడు.. రివ్యూ రిపోర్ట్ ఎలా వుంది..?

సరైనోడులో విలన్‌గా రంగస్థలంలో అందరి బాగోగులు కోరే వ్యక్తిగా నటించిన ఆది పినిశెట్టి.. తాజాగా నీవెవరో అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. యూటర్న్‌లో పోలీసాఫీసరుగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు.

సినిమా పేరు: నీవెవరో 
నటీనటులు: ఆది పినిశెట్టి, రితికా సింగ్, తాప్సీ, వెన్నెల కిషోర్ తదితరులు 
నిర్మాతలు: కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ 
దర్శకత్వం: హరినాథ్
సంగీతం: అచ్చు
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: ప్రదీప్ 
 
సరైనోడులో విలన్‌గా రంగస్థలంలో అందరి బాగోగులు కోరే వ్యక్తిగా నటించిన ఆది పినిశెట్టి.. తాజాగా నీవెవరో అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. యూటర్న్‌లో పోలీసాఫీసరుగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు. తాజాగా ఆది పినిశెట్టి నటించిన నీవెవరో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం..
 
కథలోకి వెళ్తే.. కళ్యాణ్(ఆది పినిశెట్టి) అంధుడు అయినప్పటికీ మంచి టాలెంట్ వున్న వ్యక్తి. తన టాలెంట్‌తో ఓ రెస్టారెంట్‌కు యజమాని అవుతాడు. అమితంగా ప్రేమించే తల్లితండ్రులు, తనంటే ప్రాణం పెట్టే స్నేహితురాలు అను(రితికా సింగ్), తన రెస్టారంట్‌కి వచ్చే జనాలకు వంట చేసి పెట్టడం ఇదే కళ్యాణ్ జీవితం. అనుకి కళ్యాణ్ అంటే ఇష్టం. అదే విషయాన్ని ఇంట్లో కూడా చెబుతుంది. చిన్నప్పటి నుండి స్నేహితులు కావడంతో ఇంట్లో వారు కూడా పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం అను తన మీద జాలితో పెళ్లికి ఒప్పుకుందనే ఫీలింగ్‌తో వుంటాడు. 
 
కానీ ఓ రోజు రాత్రి కళ్యాణ్ రెస్టారంట్‌లో ఉండగా.. వెన్నెల(తాప్సీ) అనే అమ్మాయి వస్తుంది. ఒక ముసలాయన ఆకలితో ఉన్నాడని కళ్యాణ్ సహాయంతో అతడికి భోజనం ఇస్తుంది. వెన్నెలలో ఆ లక్షణాలు ఇష్టపడిన కళ్యాణ్ ఆమెను ప్రేమిస్తాడు. వెన్నెల కూడా కళ్యాణ్‌ని ఇష్టపడినట్లుగానే కనిపిస్తుంది.
 
తన ప్రేమ విషయాన్ని వెన్నెలకి చెప్పే సమయంలో ఆమె ఓ ప్రమాదంలో ఉందని కళ్యాణ్ తెలుసుకుంటాడు. మరుసటి రోజుకి కాల్ మనీ గ్యాంగ్ కి ఇరవై లక్షలు ఇవ్వకపోతే వెన్నెలని తీసుకువెళ్లిపోతారని కళ్యాణ్‌కి తెలుస్తుంది. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ అనుకోకుండా అతడికి యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్‌లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అతడికి చూపు తిరిగొస్తుంది. 
 
ఆ తర్వాత వెన్నెల కోసం చాలా చోట్ల వెతుకుతాడు. కానీ ఆమె దొరకదు. మరోపక్క తన తల్లి బాధ పడుతుందని అనుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు కళ్యాణ్. అదే సమయంలో వెన్నెల తండ్రి కళ్యాణ్‌ని కలిసి వెన్నెలను కాల్ మనీ గ్యాంగ్ ఎత్తుకుపోయిందని డబ్బు డిమాండ్ చేస్తున్నారని చెబుతాడు. దీంతో డబ్బులు ఇచ్చి వెన్నెలని తీసుకురావాలనుకుంటాడు. మరి కళ్యాణ్‌కి వెన్నెల దొరుకుతుందా..? అసలు ఎవరీ వెన్నెల..? కళ్యాణ్ చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేదే సినిమా. 
 
విశ్లేషణ: 
గతేడాది తమిళంలో విడుదలై సక్సెస్ అందుకున్న 'అధె కంగల్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. వినూత్నమైన పాయింట్‌తో ఈ కథను రాసుకున్నారు. కాల్ మనీ గ్యాంగ్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఇంటర్వల్ సమయానికి ప్రేక్షకుల్లో సందేహాలు కలుగుతాయి. అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకుల ఊహకు అందదు. అయితే సినిమా అప్పటివరకు కాస్త స్లో గా నడవడం, ఇంటర్వల్ టైమ్‌కి ట్విస్ట్‌లు రాసుకున్నప్పటికీ వాటిని ప్రేక్షకులకు ఆకట్టుకునే రీతిలో కనెక్ట్ చేయలేకపోయారు. తెరపై కొన్ని షాట్లు, సీన్లు ఇంకా బెటర్ గా తీయొచ్చనే భావన కలుగుతుంది.
 
హీరోకి కళ్లు వచ్చాక ప్రేమించిన అమ్మాయి ఏమైపోయిందా..? అని వెతికే ప్రాసెస్‌లో అతడికి తెలిసే నిజాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ చివరి అరగంట సేపు సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం. సినిమా విలన్ క్యారెక్టర్ సరికొత్తగా రాసుకున్నారు. ఆ పాత్రను తెరపై పోట్రేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో మరో చిన్న ట్విస్ట్‌తో సినిమాను ముగించడం బాగుంది. కొంత సమయం పాటు తెరపై అంధుడిగా కనిపించాడు ఆది పినిశెట్టి. ఆ పాత్ర చూస్తున్నంతసేపు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ గుర్తొస్తాడు. 
 
అంధుడైనా అసలు తడబడకుండా విలన్స్‌తో ఫైట్స్ చేస్తుంటాడు. ప్రేమించి అమ్మాయి కోసం పిచ్చోడిలా వెతుకుతూ తిరిగే పాత్రలో ఆది బాగా నటించాడు. సెకండ్ హాఫ్ తాప్సీతో ఆది కాంబినేషన్ సీన్లు పండాయి. వీరిద్దరి మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్‌ని ఎవరూ ఊహించలేరు. రితికా సింగ్ పాత్ర రెగ్యులర్ హీరోయిన్ మాదిరి అనిపిస్తుంది. 
 
తాప్సీ రోల్ మాత్రం సినిమాకు హైలై‌ట్‌గా నిలిచింది. ఓ పక్క క్యూట్ గా కనిపిస్తూనే మరోపక్క కన్నింగ్ ఆలోచనలతో కనిపించడం ప్రేక్షకులను బాగా  ఎంటర్టైన్‌చేస్తుంది. ఆ పాత్రలో తాప్సీ అధ్బుత నటన కనబరిచింది. ఇక తాప్సీని తిడుతూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్స్ నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యే వెన్నెల కిషోర్ రోల్ కొంతసేపు పాటు సినిమాకు అనవసరం అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మాత్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. సప్తగిరి నవ్వించడానికి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. శివాజీరాజా, తులసి, శ్రీకాంత్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.
 
సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఛేజింగ్ సీన్‌లో తెరపై సినిమాను చూడడం కష్టంగా అనిపిస్తుంది. సినిమాకు హైలైట్ గా నిలిచింది అచ్చు సంగీతం. ముఖ్యంగా తాప్సీ క్యారెక్టర్ తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బీజియమ్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 
 
దర్శకుడిగా హరినాథ్ ఈ సినిమాను బాగానే హ్యాండిల్ చేశాడు. అయితే ఇలాంటి సినిమాలకు ఆడియన్స్‌లో కాస్త సస్పెన్స్, సందేహాలు కలిగేలా చేయలేకపోయాడు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
 
రేటింగ్ -3.0/5