గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:33 IST)

కోవిడ్ 19 క్లినికల్ ట్రైల్స్‌లో టీకా తీసుకున్న వ్యక్తి మృతి, కారణం?

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల కోవిడ్ వాలంటీర్ మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్నాడు. ఈ ట్రైల్ వ్యాక్సిన్ తీసుకుని దాదాపు పది రోజుల తరువాత మరణించాడు. దీనితో టీకాపై ఆందోళనలు నెలకొన్నాయి. 2020 డిసెంబర్ 12న జరిగిన కోవాక్సిన్ ట్రైల్స్‌లో దీపక్ మరావి అనే వాలంటీర్ పాల్గొన్నట్లు విచారణ జరిపిన పీపుల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేష్ కపూర్ తెలిపారు.
 
మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ, మరణించిన వ్యక్తి పోస్టుమార్టం రిపోర్టులో అతడు విషం కారణంగా మరణించాడని అనుమానిస్తున్నారు. ఐతే ఖచ్చితమైన సమాచారం ఇంకా రాలేదు.
 
డాక్టర్ కపూర్ మాట్లాడుతూ... మృతిచెందిన మరావికి టీకా షాట్ ఇవ్వబడిందా లేదంటే ప్లేసిబో ఇవ్వబడిందా అని ధృవీకరించలేమని చెప్పారు. "ఇది (ట్రయల్ కోసం ద్రవాన్ని కలిగి ఉన్న సీసా) బయటకు వచ్చి కోడ్ చేయబడింది. ట్రైల్ సమయంలో, 50 శాతం మందికి అసలు ఇంజెక్షన్ లభిస్తుంది, మిగిలిన వారికి సెలైన్ ఇస్తారు" అని ఆయన చెప్పారు. కాగా ఈ విషయంపై మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి ఫోన్ కాల్స్ పట్ల స్పందించలేదు.
 
కాగా డిసెంబర్ 12న మరావి, అతని సహోద్యోగికి కోవాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. "అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అసౌకర్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తరువాత, అతను నోట్లో నురుగు కక్కాడు. అతను ఒకటి లేదా రెండు రోజుల్లో బాగానే ఉంటానని చెప్పి వైద్యుడిని చూడటానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతడి పరిస్థితి క్షీణించింది. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించారు. కాని అతను మార్గమధ్యంలోనే (డిసెంబర్ 21 న) మరణించాడు" అని వారు తెలిపారు. అయితే, ఈ ఆరోపణను ఆసుపత్రి ఖండించింది.