శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (15:32 IST)

ఉపఎన్నికల దెబ్బకు దిగివచ్చిన అమిత్ షా.. మిత్రుల దర్శనానికి రాయబారం

దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగివచ్చారు. నిన్నామొన్నటివరకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఏమాత్రం పట్టించుకోని ఆయన.. ఇపుడు తిరిగి వారితో చెలిమికి తహతహ

దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగివచ్చారు. నిన్నామొన్నటివరకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఏమాత్రం పట్టించుకోని ఆయన.. ఇపుడు తిరిగి వారితో చెలిమికి తహతహలాడుతున్నారు. ఇందులోభాగంగా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో అమిత్ షా భేటీ కానున్నారు. వీరిద్దరి సమావేశం బుధవారం సాయంత్రం ముంబైలో జరుగనుంది.
 
నిజానికి బీజేపీతో తెగదెంపుల తర్వాత బీజేపీపై శివసేన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన పాల్‌ఘర్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కూడా శివసేన ఆరోపించింది. తమకు రాజకీయాల్లో అతిపెద్ద శత్రువు బీజేపీనే అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా.. ఉద్ధవ్ థాక్రేను కలవడనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అమిత్ షానే ఉద్ధవ్ జీ సమయం కోరారు. బుధవారం సాయంత్రం వీళ్ల సమావేశం ఏర్పాటు చేశాం అని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
 
నిజానికి కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చిన తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఏమాత్రం లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చారు. అయితే, ఇటీవలి కాలంలో బీజేపీకి ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవయ్యాయి. ఈ ఫలితాలతో కుంగిపోయిన బీజేపీ అగ్రనేతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. ఇన్నాళ్లూ ఎన్డీయేలోని మిత్రులు పోతే పోనీ అన్నట్లుగా వ్యవహరించిన ఆ పార్టీ మళ్లీ వాళ్లని అక్కున చేర్చుకునే పనిలోపడ్డారు.