1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:25 IST)

చంద్రబాబు పిల్ల కుంకతో హత్య ప్లాన్ చేస్తాడా? మంత్రి సోమిరెడ్డి

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాముగాను ప్లాన్ చేస్తే గిచ్చుకోవడాలు, గిల్లుకోవడాలు ఉండవన్నారు. అదేసమయంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిల్ల కుంకతో హత్య ప్లాన్ చేస్తాడా అని ప్రశ్నించారు. 
 
జగన్‌పై ఆయన అభిమాని చేసిన దాడిపై మంత్రి సోమిరెడ్డి శుక్రవారం స్పందించాడు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవటాలు గుచ్చుకోవటాలు ఉండవని... ప్లాన్ చేయాలనుకుంటే రాజారెడ్డి, వైఎస్, జగన్ తరహాలోనే చేస్తామని వ్యాఖ్యానించారు. కానీ అలా చేసే ఆలోచనలు తమవి కావని మంత్రి స్పష్టంచేశారు.
 
జగన్‌కు అరసెంటీమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చెయ్యాలా? అని ప్రశ్నించారు. ఒక గవర్నర్ 12 ఏళ్లుగా ఒకే చోట ఉన్న సందర్భం ఉందా అని ఆయన నిలదీశారు. నరసింహన్‌పై కేంద్రానికి ఎందుకింత ప్రేమ అని నిలదీశారు. దాడి విషయంలో వైసీపీ కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదని మండిపడ్డారు. విశాఖలో కుట్లు వేసే డాక్టర్లే లేరా... దానికి హైదరాబాద్ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. 
 
జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే చీపురుపుల్ల కూడా గుచ్చుకోలేదని, కేంద్ర పరిధిలో ఉన్న విమానాశ్రయంలోకి వెళ్ళగానే జగన్‌పై దాడి జరిగిందని అన్నారు. కేంద్రం అమలు చేసిన డ్రామాలో సీఐఎస్‌ఎఫ్‌ కూడా సహకరించిందా? అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.