శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:07 IST)

పెళ్లి భోజనం బాగా లేదని అతిథులు ఏం చేసారంటే..?

ఇంతకు ముందైతే పెళ్లి అంటేనే ఎన్నో పనులు, అస్సలు తీరిక లేకుండా కొన్ని రోజుల పాటు తలా ఒక పని చేస్తేనే పెళ్లి నాటికి అన్నీ పూర్తయ్యేవి. ఇక పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఇంటి దగ్గరే జరిగేవి, కనుక వంటవారిని ఇంటి దగ్గరకే పిలిపించి తమ ఆధ్వర్యంలోనే వంటలు చేయిస్తూ, అప్పుడప్పుడూ పరిశీలిస్తుండేవారు. కార్పొరేట్ కాలం పుణ్యమాని ఇప్పుడు అన్నీ రెడీమేడ్లే. 
 
వెడ్డింగ్ ప్లానర్స్‌కు అప్పగించేస్తే చాలు, అన్ని పనులు వారే చూసుకుంటారు. రిసెప్షన్‌లు కూడా హోటల్‌లలో ఏర్పాటు చేసి, అక్కడే విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ వంటకాల తయారీ విధానంపై పర్యవేక్షణ లోపంతో కొన్నిసార్లు నాణ్యత బాగుండటం లేదు. కొన్నిసార్లు అతిథులు మమ అనిపించేసి, బయటికెళ్లి కామెంట్స్ చేసేవారు. కానీ ఇక్కడ మాత్రం అతిథులు ఊరుకోకుండా హోటల్ సిబ్బందికి గట్టిగా బుద్ధి చేప్పారు.
 
పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన పెళ్లి తంతు ముగియగానే అతిథులంతా భోంచేసేందుకు వెళ్లారు. భోజనం బాగాలేదని, నాణ్యత లోపించిందని అతిథులు హోటల్‌ యాజమాన్యంతో గొడవపడ్డారు. గొడవ తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన అతిథులు ప్లేట్లన్నింటినీ పగులగొట్టి, వంట పదార్థాలను కిందపడేసి, అంతటితో ఆగకుండా సిబ్బందిని చితకబాదారు. ఈ వీరంగాన్ని అక్కడున్న కొంతమంది వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టగా వైరల్ అవుతోంది.