ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (17:55 IST)

గంటాతో కలిసి 16న ఢిల్లీ వెళ్లనున్న చిరంజీవి, గంటా కోసమా లేక సైరా కోసమా?

మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఏపీ క్యాపిటల్ ప్రాంతంలోని సీఎం నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి శాలువాతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సత్కరించి, బొకే ఇవ్వ‌గా జ‌గ‌న్ చిరంజీవిని శాలువా స‌త్క‌రించారు. ఇదిలావుంటే... నెల 16న చిరంజీవి, గంటా శ్రీనివాస్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుని క‌ల‌వ‌నున్నారు అని తెలిసింది. 
 
ఎందుకంటే.. చారిత్రాత్మ‌క చిత్రం సైరా సినిమాని వీక్షించాల‌ని కోరేందుకు అని స‌మాచారం. అస‌లు ఈ రోజే గంటా శ్రీనివాస్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లాల్సి వుంది. అయితే.. పార్టీ మారే ఆలోచ‌న‌లపై గంటా శ్రీనివాస్‌కి ఇంకా క్లారిటీ రాలేదు. అందుచేత 16న వెంక‌య్య‌నాయుడుని క‌ల‌వ‌డంతో పాటు.. ప్ర‌ధానిని కూడా చారిత్రాత్మ‌క సినిమాని చూడ‌మ‌ని కోరేందుకు గాను అపాయింట్మెంట్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.
 
ఇదిలావుంటే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతూ వున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతుంటే మరికొందరు భాజపాలోకి వెళ్తారని అంటున్నారు. చిరంజీవి ప్రధానమంత్రిని కలవనున్నారన్న వార్తల నేపధ్యంలో గంటాకు భాజపా తీర్థం ఇప్పించడంలో సైరా నరసిహారెడ్డి సాయం చేస్తారేమోనన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మొత్తమ్మీద చిరంజీవితో గంటా శ్రీనివాసరావు కలిసి వెళ్లడమైతే చర్చనీయాంశంగా మారింది.