1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:32 IST)

వణికిస్తున్న కరోనా వైరస్... భారత్ సహా 20 దేశాలకు వ్యాప్తి... 13 వేల మందికి నిర్ధారణ

చైనా దేశంలోని వుహాన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ఇపుడు మరింతగా వణికిస్తోంది. ఇప్పటికే భారత్ సహా 20 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఫలితంగా 13 వేల మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో 50 వేల మంది రక్తపరీక్షల ఫలితాలు వెల్లడికావాల్సివుంది. ముఖ్యంగా ఈ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్ నగరంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 
 
కాగా, ఈ వైరస్ సోకినవారిలో ఇప్పటివరకూ రోజుకు 10 నుంచి 20 మరణాలు నమోదుకాగా, గడచిన రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపు అయింది. బుధవారం నాటికి 120 మంది మరణించారని అధికారిక లెక్కలు విడుదల చేసిన చైనా, నేడు ఆ సంఖ్య 259కి చేరినట్టు పేర్కొంది. అనధికారికంగా మరో 50 మందికి పైగా కరోనా కారణంగా మృతి చెంది వుంటారని అంచనా.
 
కాగా, ఈ వైరస్ ఇప్పటివరకు భారత్ సహా మొత్తం 20 దేశాలకు వ్యాపించింది. దీంతో అన్ని దేశాల విమానాశ్రయాల్లో విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 
 
ఎయిర్ పోర్టులకు సమీపంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన వివిధ దేశాలు, 14 రోజుల పాటు వారిని అక్కడే ఉంచి, కరోనా లక్షణాలు కనిపించకుండా ఉంటేనే బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, చైనా పౌరులకు జారీ చేసే వీసాలపై భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అలాగే, చైనాకు అనేక దేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.