1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (14:20 IST)

బరితెగించిన ఎమ్మెల్యే తమ్ముడు... పిస్టల్‌తో యువజంటకు బెదిరింపులు

దేశరాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున ఓ ఎమ్మెల్యే తమ్ముడు బరితెగించాడు. స్టార్ హోటల్‌లో ఓ యువ జంటను తుపాకీతో బెదిరించాడు. ఇది హోటల్‌లోని సీసీ టీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయింది. ఈ వీడియోలు బయటకు లీక్ కాగానే కేంద్ర హోం సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. పిస్టల్ చేతపట్టుకుని బెదిరించిన వ్యక్తిపై అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద కఠినతరమైన కేసును నమోదు చేసినట్టు ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌లో బడానేత తనయుడొకరు రివాల్వర్‌తో కలకలం రేపాడు. ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద యువజంటను బెదిరిస్తూ హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తిని బీఎస్పీ ఎమ్మెల్యే రితేశ్ పాండే సోదరుడు, మాజీ ఎంపీ రాకేశ్ పాండే కుమారుడు ఆశిష్ పాండేగా గుర్తించారు. 
 
శనివారం సాయంత్రం హయత్ రేజెన్సీ హోటల్‌వద్ద పార్కింగ్ స్థలం కోసం ఆశిశ్ పాండే ఆ జంటతో జగడానికి దిగినట్టు చెబుతున్నారు. నల్ల టీషర్టు, గులాబీరంగు ప్యాంటు ధరించిన ఆశిశ్... ఓ పిస్టల్ తీసుకెళ్లి యువజంటను బెదిరిస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది. అతన్ని హోటల్ సిబ్బంది వారిస్తున్నా వినకుండా ఆశిష్ బండబూతులు తిడుతూ గొడవకు దిగాడు. 
 
ఆశిశ్‌తో పాటు వీడియోలో కనిపిస్తున్న మరో యువతి కూడా ఆ జంటతో గొడవపడినట్టు కనిపిస్తోంది. అశిశ్  కారులో కూర్చున్న ఓ యువతి ఈ సంఘటన మొత్తం వీడియో తీసింది. హోటెల్ సెక్యురిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు.. అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆశిశ్ సోదరుడు రితేశ్ ప్రస్తుతం అంబేద్కర్‌ నగర్‌లోని జలాల్‌పూర్ నుంచి బీఎస్పీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.