ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (09:16 IST)

డోనాల్డ్ ట్రంప్ ప్రస్థానం ముగిసినట్టేనా? న్యాయ పోరాటంలో చుక్కెదురు!!

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్థానం ముగిసినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ ఓట్లు సాధించడంలో విఫలమయ్యారు. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేస్తూ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, కోర్టులో కూడా ఆయన చుక్కెదురైంది. దీంతో ఆయన కథ ముగిసినట్టేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
 
బుధవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక రోజు గడిచిన తర్వాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను కోర్టులో ట్రంప్ సవాల్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, ఆపై అనూహ్యంగా బైడెన్ పుంజుకుని వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ముఖ్యంగా, జార్జియా విషయంలో 53 బ్యాలెట్ బాక్సులు ఆలస్యంగా వస్తే, వాటిని కలిపివేశారని ఆరోపిస్తూ, ట్రంప్ టీమ్ కోర్టుకెక్కింది. మిచిగన్‌లో ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ రెండు రాష్ట్రాల న్యాయమూర్తులూ ట్రంప్ పిటిషన్లను తోసిపుచ్చారు.
 
జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్ ఈ మేరకు తీర్పునిస్తూ, బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్, కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదన్నారు. 
 
ఇక, నెవెడా విషయంలోనూ, అందునా జనాబా ఎక్కువగా ఉన్న క్లార్క్ కౌంటీ, లాస్ వెగాస్ ఓటింగ్‌లోనూ అక్రమాలు జరిగాయని ట్రంప్ అనుచురులు ఆరోపిస్తున్నారు. ఇక, మిచిగన్, జార్జియా కోర్టు తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. 
 
మరోవైపు, నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్‌లో విజయం బైడెన్ పరమైంది. జార్జియాలో మాత్రం ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని నెవడా మాజీ అటార్నీ జనరల్, ట్రంప్ టీమ్ సభ్యుడు అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
 
ఈ పరిణాలన్నింటిపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, దేశంలో బ్లూ వేవ్ (డెమొక్రాట్ల గాలి) ఎక్కడా కనిపించలేదని, ప్రతి చోట రెడ్ వేవే (రిపబ్లికన్ గాలి) ఉందన్నారు. మెయిల్ ఇన్ ఓటింగ్‌ను అవినీతి వ్యవస్థగా అభివర్ణించిన ట్రంప్, ఈ ఏడాది రిపబ్లిక్ మహిళల సంవత్సరంగా నిలిచిపోతుందన్నారు.
 
ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మీడియాపై మండిపడుతున్న ట్రంప్ తాజాగా మరోమారు మీడియాను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మీడియా, టెక్ కంపెనీలు జోక్యం చేసుకున్నాయని, అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో తన గెలుపును ఆపలేకపోయినట్టు పేర్కొన్నారు. 
 
లీగల్ ఓట్లను లెక్కిస్తే కనుక తన విజయం మరింత సులభం అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ఆయన గురువారం తొలిసారి వైట్‌హౌస్‌కు వచ్చి మీడియాతో మాట్లాడారు.