శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (16:17 IST)

నేను రావణుడి ప్రతిమకు నిప్పు పెట్టగానే వెళ్లిపోయా? సిద్ధూ భార్య

పంజాబ్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 61కి చేరుకుంది. రావణదహన కార్యక్రమం వీక్షిస్తుండగా పట్టాలపై నిల్చున్న వారిపైకి రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. ఓ వైపు ప్రజల పై నుంచి రైలు దూసుకెళ్తుంటే మంత్రి సిద్ధూ భార్య అలాగే ప్రసంగం కొనసాగించారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
అంతేకాకుండా, ఈ ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు సహాయం చేయకుండా సిద్ధూ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి లేకుండా అక్కడ నిర్వహించడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం, సిద్ధూ భార్య ప్రమాదం జరిగాక పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడున్న వారంతా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
అయితే పంజాబ్ రైలు ప్రమాదం నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ తీవ్రంగా స్పందించారు. తమపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనపై వస్తున్న విమర్శలపై కౌర్ ఆవేశంగా స్పందించారు. తానేమైనా వారిని రైలు పట్టాలపై కూర్చోమని ఆదేశించానా? అని ప్రశ్నించారు. 
 
ట్రాక్‌పై కూర్చున్న వారిని తొక్కుకుంటూ వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పానా? అని నవజోత్ నిలదీశారు. తాను వెళ్లిపోయిన పదిహేను నిమిషాల తర్వాత ప్రమాదం జరిగిందని, ఆ విషయాన్ని తన సహాయకుడొకరు ఫోన్లో చెప్పారని కౌర్ తెలిపారు.
 
మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించిన ఆమె రావణుడి ప్రతిమకు నిప్పు పెట్టగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు క్లారిటీ ఇచ్చారు. వందలాదిమంది యువకులు రైలు పట్టాలపైకి చేరి సెల్ఫీలు తీసుకున్నారని పేర్కొన్నారు. అక్కడ రావణ దహనం జరగడం ఇదేమీ కొత్త కాదని, ప్రతీ ఏటా జరుగుతూనే ఉందని చెప్పారు. ప్రమాదానికి రైల్వే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కౌర్ పేర్కొన్నారు. 
 
రైలు వస్తున్నప్పుడు పట్టాలను క్లియర్ చేయాల్సిన బాధ్యత రైల్వేదేనని కౌర్ తేల్చి చెప్పారు. మరోవైపు ఈ రైలు ప్రమాదానికి రాజకీయాలు అంటగట్టవద్దని, తన భార్య ఈ ప్రమాదంలో గాయపడిన వారికి సాయం అందిస్తోందని మంత్రి సిద్ధూ స్పష్టం చేశారు.