గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By mohan
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (12:08 IST)

బయోపిక్‌ల బాట పట్టిన ఇండియన్ సినిమా...

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చలనచిత్ర పరిశ్రమలలో బయోపిక్‌ల వార్ నడుస్తోంది. హిందీలో ఈ సంస్కృతి చాలా సాధారణమైనప్పటికీ, ఇప్పుడు తెలుగును కూడా వదలడం లేదు. హిందీలో క్రికెట

ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చలనచిత్ర పరిశ్రమలలో బయోపిక్‌ల వార్ నడుస్తోంది. హిందీలో ఈ సంస్కృతి చాలా సాధారణమైనప్పటికీ, ఇప్పుడు తెలుగును కూడా వదలడం లేదు. హిందీలో క్రికెటర్ ధోనీ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్‌ధోనీ సినిమా హిట్ కావడంతో మరికొన్ని సినిమాలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రధానంగా మేరీ కోమ్ జీవిత ఆధారంగా వచ్చిన మేరీ కోమ్, క్రికెట్ గాడ్ సచిన్ జీవిత ఆధారంగా వచ్చిన సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, అజహర్, మాంఝీ, దంగల్ వంటి చిత్రాలు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఇటువంటి సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. 
 
తాజాగా ఖల్నాయక్ సంజయ్ దత్ జీవిత ఆధారంగా సంజూ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వాటిలో పరిటాల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రక్తచరిత్ర సినిమా బాగా ఆడినప్పటికీ రెండవ భాగం ఆకట్టుకోలేకపోయింది. తర్వాత వంగవీటి అనే సినిమా వచ్చినా అదీ నిరాశనే మిగిల్చింది. ఇక సావిత్రి జీవిత కథగా వచ్చిన మహానటి అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడమే గాక ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. 
 
తాజాగా ఎన్టీయార్ జీవితం ఆధారంగా బాలకృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్నాడు, మరోపక్క వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా మమ్ముట్టి హీరోగా యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ఇంకొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మన్మోహన్ సింగ్ జీవిత ఆధారంగా అనుపమ్ ఖేర్ హీరోగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, అలాగే క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఆనంద్ కుమార్ అనే గణితవేత్త జీవిత కథ ఆధారంగా వస్తున్న సుపర్ 30లో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. ఈవిధంగా ప్రస్తుతం భారతదేశ చలనచిత్రాలన్నీ ఎక్కువ భాగం బయోపిక్‌ల ఆధారంగా తెరకెక్కుతుండటం గమనార్హం.