బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (10:56 IST)

ఉద్యమ పంథాలోకి మారిన ప్రత్యేక హోదా పోరు.. రహదారుల దిగ్బంధనం

ప్రత్యేక హోదా పోరు ప్రత్యేక పంథాలోకి మారుతోంది. హస్తిన వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు పోరాడుతుంటే.. క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి.

ప్రత్యేక హోదా పోరు ప్రత్యేక పంథాలోకి మారుతోంది. హస్తిన వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు పోరాడుతుంటే.. క్షేత్రస్థాయిలో యువతను, సామాన్య ప్రజలను కదిలించే దిశగా రాజకీయపార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులోభాగంగా, గురువారం 13 జిల్లాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రధాన రాజకీయపక్షాలన్నీ పిలుపునిచ్చాయి. 
 
దీంతో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు, రోడ్లపైకి వచ్చి రహదారులను దిగ్బంధించేందుకు రంగంలోకి దిగారు. మరోవైపు, టీడీపీ కూడా శాంతియుతంగా నిరసనలు తెలియజేయనుంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐలు ప్రజాసంఘాల ఐక్యవేదిక పేరిట నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపిచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహించే కార్యక్రమమైనందున నిరసనకు నైతిక మద్దతును తెలియజేస్తున్నామని టీడీపీ వివరించింది.
 
అధికారంలో ఉన్నందున బంద్‌లూ, రాస్తారోకోలలో పాల్గొనే అవకాశం లేదని తెలిపింది. ఈ ఆందోళనకు వైసీపీ సంఘీభావం తెలిపింది. రహదారుల దిగ్బంధంలో పొల్గొనాలని పార్టీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతును ఇచ్చింది. జనసేన కూడా హోదా కోసం చేసే పోరాటంలో పాల్గొంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా నిరసన తెలపాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. అన్ని పక్షాలూ రహదారుల దిగ్బంధనానికి సిద్ధం కావడంతో కార్యక్రమం విజయవంతంకానుంది.