శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (12:05 IST)

#KarnatakaVerdict : కన్నడనాట కాషాయ వికాసానికి కారణాలేంటి?

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను భావించారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను భావించారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించి సింగిల్‌గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 67 చోట్ల, బీజేపీ 113 చోట్ల, జేడీఎస్ 40, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందింది. అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించడం వెనుకగల కారణాలను విశ్లేషిస్తే...
 
కన్నడ నాట బలమైన సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్‌లకు మైనారిటీ హోదా కల్పించడంతోపాటు వారికి ప్రజాకర్షక పథకాలు ప్రకటించి వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. లింగాయత్‌లు ప్రాబల్యమున్న 36 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా దూసుకుపోవడాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రకటించిన లింగాయత్‌ల ప్రజాకర్షక పథకాలు పనిచేయలేదని విదితమవుతోంది. 
 
లింగాయత్‌లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కేవలం 16 అసెంబ్లీ స్థానాల్లోనే ముందుంది. కావేరీ నదీ జలాల వివాదాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు జాప్యం చేయడం కర్ణాటకలో ఆ పార్టీకి లాభించింది. కర్ణాటకలో మఠాల ప్రభావం ఓటర్లపై అధికంగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఇది ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, బెంగళూరు నగరంలోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారం, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ వ్యూహాలు, బళ్లారిలో గాలి సోదరుల ప్రభావం, బీఎస్. యెడ్యూరప్ప రాజకీయ వ్యూహాలతో కర్ణాటకలో కమలం వికసించిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. 
 
కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ వ్యూహం పన్నడంతో కాంగ్రెస్ పరాజయం పాలైందని భావిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా విజయపతాకం ఎగురవేసిన బీజేపీ కర్ణాటకలో సర్కారు ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఉంటామని భావించిన జేడీఎస్‌కు మరోమారు భంగపాటు తప్పలేదు. ఈ పార్టీ కేవలం 40 సీట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.