శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (11:06 IST)

జగన్‌ కోసం కేటీఆర్ : చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టుపై చర్చలా?

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా భేటీకానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ లోటప్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఈ భేటీ జరుగనుంది. ఇందులో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు... ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్టు తదితర అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి జోక్యం చేసుకున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపి.. అధికార తెరాసను ఓడించేందుకు ప్రయత్నించారు. దీన్ని తెరాస శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇచ్చితీరుతామని తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు.. కేటీఆర్ కూడా ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో జగన్‌తో కేటీఆర్ భేటీకానుండటం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ హైదరాబాద్‌లోని జగన్ నివాసంలో మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం జరుగనుంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టిన గులాబీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. ఇప్పటికే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరపగా... అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. 
 
వైసీపీ అధినేత జగన్‌ను చర్చలు జరపాల్సిందిగా కేటీఆర్‌కు సూచించారు. దీంతో రాజకీయంగా తొలిసారి కేటీఆర్.. జగన్‌తో చర్చలు జరపనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేటీఆర్‌తో ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలు ఈ భేటీకి హాజరుకానున్నారు. అలాగే, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.