బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (17:35 IST)

ప్రజల చేతిలో తన్నులు తిన్న బీజేపీ ఎమ్మెల్యే.. ఎందుకు?

మహారాష్ట్రలో అధికార బీజేపీ ఎమ్మెల్యే స్థానిక ప్రజల చేతిలో తన్నులు తిన్నారు. తొలి భార్యను కాదని రెండో పెళ్లి చేసుకుని, ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగనందుకుగాను ఈయనగారిని ప్రజలు దేహశుద్ధి చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని ఆర్నీ అసెంబ్లీ స్థానం నుంచి రాజూ నారాయణ్ తోడసామ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. అయితే, ఈయనకు అర్చన అనే మహిళతో వివాహమైంది. కానీ, ఆమెను వదిలివేసిన నారాయణ్... ప్రియా షిండే అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 
 
ఈ వివాహం జరిగినప్పటి నుంచి మొదటి భార్య గురించి పట్టించుకోవడం మానేశాడు. దీన్ని అర్చన జీర్ణించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో నారాయణ్ రెండో భార్య ప్రియా షిండేతో కలిసి స్థానికంగా ఓ క్రీడా టోర్నీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా, మొదటి భార్య అర్చన, ఆమె తల్లిదండ్రులు, మరికొందరు స్థానికులు ఆయన కారును చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో కారు దిగిన నారాయణ్‌ను అర్చనతో పాటు మిగిలినవారు పట్టుకుని చితకబాదారు. పనిలోపనిగా రెండోభార్య ప్రియాపైన కూడా దాడి చేశారు. అందరూ కలిసి పిడిగుద్దులు వర్షించడంతో ఆమె తనను వదిలిపెట్టమని రెండుచేతులు జోడించి వేడుకుంది. 
 
రెండో భార్య ప్రియను కాపాడేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించినప్పుడు అతని తల్లితోపాటు అక్కడున్నవారంతా అతడిని తీవ్రంగా కొట్టారు. ఓ గిరిజన పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్న అర్చనకు న్యాయం కావాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తల్లి కూడా ఆమె పక్షాన నిలిచింది. గత శనివారం ఈ దాడి జరుగుతుండగా దారినపోయే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 
 
దాడి జరిగిన కొద్దిసేపటికి పోలీసులు వచ్చి జనాన్ని అదుపు చేసి పంపించారు. ముఖానికి తీవ్ర గాయాలైన ప్రియాను ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్మెల్యే ఇలా రెండోభార్యను వెంటేసుకుని ఊరేగడం సిగ్గుచేటని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే.. ఆ తర్వాత ఇద్దరూ భార్యలూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాజీ పడటం గమనార్హం.