1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (08:52 IST)

మరాఠీల రిజర్వేషన్ల గొడవ.. మండుతున్న మహారాష్ట్ర...

మహారాష్ట్రలో రిజర్వేషన్ల పోరాటం మళ్లీ హింసాత్మకంగా మారింది. విద్య ప్రభుత్వ ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా మరాఠాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన స

మహారాష్ట్రలో రిజర్వేషన్ల పోరాటం మళ్లీ హింసాత్మకంగా మారింది. విద్య ప్రభుత్వ ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా మరాఠాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన సోమవారం మరింత ఉధృతంగా మారింది. దీంతో సోమవారం పుణే - నాసిక్ జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. ఈ రహదారిలో వెళ్లే వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
 
జాతీయరహదారిపై నిరసన చేపట్టిన మరాఠ క్రాంతి మోర్చ కార్యకర్తలు.. బస్సులను అడ్డుకొని విధ్వంసం సృష్టించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల అమలుకు గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మరాఠా క్రాంతి మోర్చ ఆధ్వర్యంలో కొద్ది రోజులు ఆందోళనలు జరుగుతున్నాయి. పలువురు కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారుతుంది. 
 
మరోవైపు, ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించేదాకా తాము పన్నులు కట్టబోమని 22 జిల్లాలకు చెందిన నేతలు లాతూర్‌లో జరిగిన ఓ సమావేశంలో తేల్చిచెప్పారు. ప్రాంతీయ, కులపరమైన భావోద్వేగాలకు సంబంధించిన ఈ అంశం ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలు వెంటనే ఈ ఆందోళనలకు మద్దతు పలికాయి. శివసేన కూడా మద్దతిస్తూనే విషయాన్ని నాన్చకుండా తేల్చెయ్యాలని, ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. మొత్తంమీద మరాఠా రిజర్వేషన్ల కారణంగా మహారాష్ట్ర మండుతోంది.