శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (11:04 IST)

రీవాల్యూషన్ పేరిట రూ.240 కోట్ల ముడుపులు.. ఎక్కడ?

అది దేశంలో ఉన్న టాప్ మోస్ట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ఎందరో విద్యాబోధన చేసి విద్యా మందిరం. అలాంటి యూనివర్శిటీలో పని చేసే ప్రొఫెసర్లు ఏకంగా రూ.240 కోట్ల మేర

అది దేశంలో ఉన్న టాప్ మోస్ట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ఎందరో విద్యాబోధన చేసి విద్యా మందిరం. అలాంటి యూనివర్శిటీలో పని చేసే ప్రొఫెసర్లు ఏకంగా రూ.240 కోట్ల మేరకు లంచాలు పుచ్చుకున్నారు. ఈ లంచం ఎందుకో తెలుసా.. రీవాల్యూషన్ పేరుతో అధిక మార్కులు వేసేందుకు. దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు. అలాగే, ఆయా ప్రొఫెసర్ల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అన్నా విశ్వవిద్యాలయం పరిధిలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల్లో కావాలనే అంటే ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ మార్కులు వేయడం లేదా ఫెయిల్ చేసేవారు ప్రొఫెసర్లు. ఆ తర్వాత రీవాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకోమనేవారు. ఇందులో అధిక మార్కులు వేసేందుకు లంచం పుచ్చుకునేవారు. ఇలా రూ.240 కోట్లు స్వాహా చేశారు. 
 
గత యేడాది మొత్తం 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాయగా, వారిలో 3 లక్షల మందికి పైగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. ఆపై అదనంగా 73,733 మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. మరో 16,630 మందికి అదనపు మార్కులు రాగా, మొత్తం మీద 90,369 మంది లాభం పొందారు. దీనిపై కొందరు విద్యార్థులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. రహస్యంగా విచారణ చేపట్టింది. 
 
ఈ విచారణలో 2011 నుంచి 2016 మధ్య కాలంలో 6 లక్షల మందికి రీవాల్యుయేషన్ లాభం కలిగించినట్టు తేల్చారు. అయితే, వీరిలో ఎంతమంది లంచమిచ్చారన్న విషయమై స్పష్టత రాలేదు. ఒక్కో సెమిస్టర్ ముగిసిన తర్వాత రూ.45 కోట్ల వరకూ వసూలు చేసేవారు. అలా ఆరు సెమిస్టర్లకుగాను రూ.240 కోట్లను ప్రొఫెసర్లు నొక్కేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ కేసులో గతంలో పరీక్షల నిర్వహణాధికారిగా పని చేసిన (ఎగ్జామినేషన్ కంట్రోలర్‌) అధికారితో సహా మొత్తం 10 మందిపై డీవీఏసీ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది.