1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (18:42 IST)

భారత గడ్డను ముద్దాడిన రాఫెల్.. చైనా - పాక్‌లకు రాజ్‌నాథ్ వార్నింగ్

ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం సురక్షితంగా చేరుకుని భారత గడ్డను ముద్దాడాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఐదు విమానాలు మార్గమధ్యంలో యూఏఈలో కాస్తం విశ్రాంతి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి... బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హర్యానా రాష్ట్రంలోని అంబాలా వైమానిక దళ కేంద్రానికి చేరుకున్నాయి. 
 
ఈ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్, పలువురు రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. రాఫెల్ జెట్లకు జల ఫిరంగులతో స్వాగతం పలికారు.
 
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... చైనా, పాకిస్థాన్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారత సార్వభౌమాధికారాన్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్న వారు... భారత వాయుసేన శక్తిసామర్థ్యాలను చూసి భయపడాల్సిందేనని చెప్పారు. 
 
అంతకుముందు ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ ఫైటర్ జెట్లు దాదాపు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నాయి. వీటికి మిలిటరీ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. 'గోల్డెన్ యారోస్'గా పిలిచే నెంబర్ 17 స్క్వాడ్రన్‌లో ఇవి భాగం కానున్నాయి.
 
రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలాలో ల్యాండ్ అయిన వెంటనే భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'లోహ విహంగాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. రాఫెల్ విమానాలు మన గడ్డను తాకిన క్షణం తర్వాత భారత మిలిటరీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మన వాయుసేన శక్తి సామర్థ్యాలు ఈ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్‌తో మరింత పెరగనున్నాయి' అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
 
మొత్తం 36 రాఫెల్ జెట్స్ కోసం ఫ్రెంచ్ ఏరో స్పేస్ దిగ్గజం 'డస్సాల్ట్ ఏవియేషన్'తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన విమానాలు విడతల వారీగా దేశానికి చేరుకోనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా, శత్రు విమానాలకు అందనంత సామర్థ్యంతో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా వద్ద కూడా ఇలాంటి యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం.