1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (19:19 IST)

నా భ‌ర్త‌కు ప్రాణ హాని ఉంది: దేవినేని అనుప‌మ‌

రాజమండ్రి జైలులో ఉన్న తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావు గారికి లైఫ్ థ్రెట్ ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత కు దేవినేని భార్య అనుపమ ఉత్త‌రాలు రాశారు.
 
అధికారంలో ఉన్నా, లేకపోయినా నా భర్త దేవినేని ఉమామహేశ్వరరావు ప్రజా జీవితంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన సాధారణంగా అవినీతిపరులకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు. అందువల్ల, మైనింగ్ మాఫియా, గూండాలు దేవినేని ఉమామహేశ్వరరావుని లక్ష్యంగా చేసుకుని, అతని ప్రాణానికి, కుటుంబ సభ్యులకు ఆస్తిపాస్తుల‌కు తీవ్రమైన ముప్పు చేయాలని ప్రయత్నిస్తున్నార‌ని దేవినేని అనుప‌మ పేర్కొన్నారు.
 
దేవినేని ఉమామహేశ్వరరావుపై 27 జూలై 2021 న జి.కొండూరు మండలంలో దాడి జరిగింది. కానీ, ఆయనను అక్రమ కేసులో అరెస్ట్ చేసి, రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ ను అకస్మాత్తుగా బదిలీ చేయడం వలన దేవినేని ఉమామహేశ్వరరావు  భద్రతపై తీవ్రమైన సందేహాలు, ఆందోళనలు కలుగుతున్నాయి అంటూ, త‌న లేఖకు జైలు సూపరింటెండెంట్‌ బదిలీ ఉత్తర్వులను జత చేసి అనుపమ పంపారు.
 
గతంలో పోలీసుల అదుపులో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ జైళ్లలో జరిగిన హింసాత్మక దాడులు, హత్యా ఉదంతాలను పరిశీలిస్తే, దేవినేని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, అనుచరులు దేవినేనికి ప్రాణ హాని ఉందని భయపడుతున్నార‌ని తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మైనింగ్ మాఫియా, గూండాల నుండి త‌న భర్త  దేవినేని ఉమామహేశ్వరరావుకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న‌ట్లు తెలిపారు.