మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (15:43 IST)

నిర్భయ కేసు : క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన ఓ ముద్దాయి

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులకు ఈనెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరిశిక్షలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ పాటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ల మేరకు ఈ చర్యలు చేపట్టారు. అయితే, ఓ దోషి మాత్రం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరిశిక్షపై స్టే ఇవ్వాలంటూ క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. అంటే న్యాయపరంగా తనకున్న చివరి అవకాశాన్ని దోషి వినయ్ కుమార్ శర్మ వినియోగించుకున్నాడు. 
 
గత 2012 డిసెంబరు 16వ తేదీన ఢిల్లీలో ఓ పారామెడికల్ వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. 
 
ఈ కేసులో మిగిలిన నలుగురు ముద్దాయిలైన ముఖేశ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(అక్షయ్‌ ఠాకూర్‌)(31)పై అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్ వారెంట్ జారీచేశారు. దీంతో వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో నిర్భయ కేసులోని దోషులకు ఈనెల 22వ తేదీన ఉరిశిక్షలు అమలవుతాయా లేదా అన్న సందేహం నెలకొంది.