శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (11:30 IST)

అవిశ్వాసం గోవిందా.. నిరవధికంగా లోక్‌సభ వాయిదా.. మిథున్‌రెడ్డి రాజీనామా

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు చేపట్టారు. అవిశ్వాసం తీర్మానంపై నోటీసులు ఇచ్చారు. అయితే కావేరి బోర్డు ఏర్పాటుకు డిమాండ్

ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు చేపట్టారు. అవిశ్వాసం తీర్మానంపై నోటీసులు ఇచ్చారు. అయితే కావేరి బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన బాట పట్టడంతో.. సభలో గందరగోళం ఏర్పడింది. ఇదే తంతు అవిశ్వాసం నోటీసులు అందుకున్నప్పటి నుంచి చోటుచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారంతో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. దాదాపు మూడు వారాలకు పైగా సాగిన సభలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజైనా, కనీసం ఒక్క అంశంపైనైనా చర్చ సాగలేదు. లోక్‍సభ చివరి రోజైన శుక్రవారం సభ నిరవధికంగా వాయిదా పడింది. 
 
లోక్ సభ చివరి రోజు కూడా అధికార పార్టీలో కదలిక కనిపించలేదు. ఏఐఏడీఎంకే సభ్యులకు నచ్చజెప్పాలని, అవిశ్వాస తీర్మానంపై చర్చిద్దామని ప్రభుత్వం ఏమాత్రం భావించలేదు. ఇంకా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
 
అంతకుముందు 11 గంటలకు సభ ప్రారంభమైన తరువాత అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి వెళ్లి, తమ కావేరీ నదీ జలాల బోర్డు సంగతేంటని నినాదాలు చేశారు. అయితే సభ నడిచిన రోజులు, సమావేశపు వివరాలు.. ఆమోదం పొందిన బిల్లుల గురించి క్లుప్తంగా చెప్పిన స్పీకర్.. అది ముగియగానే సభను నిరవధికంగా వాయిదా వేశారు.
 
లోక్‌సభ వాయిదా పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు సభలోనే ఉన్నారు. లోక్‌సభలోనే టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ప్రధాని కుర్చీ ముందు టీడీపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పీవీ మిధున్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
తొలుత శుక్రవారం పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన తరువాత ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు చెప్పిన ఆయన, అనూహ్యంగా సభ ప్రారంభానికి గంట ముందే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను మిథున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్‌‌కు పంపారు. స్పీకర్ ఫార్మాట్ లోనే లేఖను అందించానని చెప్పారు.