శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (13:45 IST)

ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదు.. చిరంజీవిలా ప్రవాహం లేదు... పవన్ కళ్యాణ్

తాను రాజకీయ పార్టీ పెట్టి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదు. చిరంజీవిలా ప్రవాహం లేదన్నారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో రివరిన్‌ రిసార్టులో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్‌ జనసేనలో చేరారు. వారికి పవన్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'నేను పార్టీ పెట్టినప్పటి నుంచీ అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఎన్టీఆర్‌లా ఉప్పెన లేదు. చిరంజీవిలా ప్రవాహం లేదు. నేను రాజకీయాల్లో మార్పు కోసం 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేయడానికి వచ్చా. వెంటనే ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక లేదు. ప్రస్తుత రాజకీయం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. కులంతో కొన్ని కుటుంబాలే బాగుపడ్డాయి. ఆ కులాలు మాత్రం బాగుపడలేదు. ఈ ప్రయాణంలో గెలుపోటములను పట్టించుకోను. కులాల మధ్య ఐక్యత అవసరం. నూనూగు మీసాల యువకులే నాకు రక్షణ. నా రక్షణకు ఏకే-47 అవసరం లేదు. వారి ప్రేమే రక్షణ కవచం' అని చెప్పారు. 
 
దెందులూరులో ఒక ప్రజా ప్రతినిధి కులం పేరుతో అధికారులను తిడుతున్నా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సీపీఎస్‌ రద్దు అంశం మేనిఫెస్టోలో పెట్టాను. దానిని అమలు చేసి తీరుతాను. పదేళ్ల రాజకీయ అనుభవం నాకుంది. 2009 ఎన్నికలకు నేనున్నాను. 2014లో ఎన్నికల్లో నాకు అనుభవం ఉంది. 2019కి మరోసారి సిద్ధంగా ఉన్నా. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలకుండా టీడీపీకి సహకరించాను. ఈ పార్టీ వస్తే సమస్యలు తీరాయని ఆశించాను. అయితే నా కోరిక తీరలేదు. 2019లో ప్రభుత్వం స్థాపించే విధంగా ముందుకు సాగుతా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.