శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 11 అక్టోబరు 2019 (21:13 IST)

హరిద్వార్ రూమ్ నెం.220లో పవన్ కళ్యాణ్, సాధారణమైన గదిలో?

విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం హరిద్వారకు చేరుకున్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన, రామన్ మెగసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయిన సందర్భంలో అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 
 
ఇచ్చిన మాట ప్రకారం వెన్నునొప్పి బాధ ఇంకా పూర్తిగా తగ్గనప్పటికీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్ లోని శివారు ప్రాంతంలో ఉన్న మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ ఆశ్రమాన్నే కేంద్రంగా చేసుకుని శ్రీ జి.డి. అగర్వాల్ గంగా ప్రక్షాళణ పోరాటం జరిపారు. ఆశ్రమ గురూజీ శ్రీ స్వామి శివానంద మహరాజ్, వాటర్ మ్యాన్ శ్రీ రాజేంద్ర సింగ్‌లు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు.
 
శ్రీ పవన్ కళ్యాణ్ సంప్రదాయసిద్ధమైన తలపాగను శ్రీ రాజేంద్రసింగ్ కట్టారు. గంగానదిని పరిశ్రమలు, ప్రభుత్వాలు ఏవిధంగా కలుషితం చేస్తున్నాయో ఈ సందర్భంగా శివానంద మహరాజ్ శ్రీ పవన్ కళ్యాణ్‌కి వివరించారు. ఇదే ఆశ్రమానికి చెందిన స్వామి నిగమానంద సరస్వతి గంగా ప్రక్షాళణ కోసం అన్నపానీయాలు మాని 115 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి చివరికి అసువులు బాశారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన ఓ సత్కార్యం కోసం ప్రాణాలు అర్పించారని శివానంద్ మహరాజ్ తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పోరాట స్ఫూర్తి గురించి తాను తెలుసుకున్నానని, గంగా ప్రక్షాళణ పోరాట యాత్రకు ఆయన బాసట కావాలని కోరారు. దక్షిణాది నుంచి గంగా ప్రక్షాళణ పోరాటానికి తగినంత మద్దతు లభించడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ దానిని భర్తీ చేయాలని కోరారు. 
గంగను కాలుష్యానికి గురిచేయడం అంటే మన సంస్కృతిని కలుషితం చేయడమేనని అన్నారు. కాలుష్యం నుంచి ఒక్క గంగనే కాదని, భారతదేశంలోని అన్ని నదులను కాపాడుకోవాలని కోరారు.