శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (15:16 IST)

శ్రీవారి నగలు ఏమయ్యాయో నాకు తెలుసు : పవన్ కళ్యాణ్ ట్వీట్

శ్రీవారి నగల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ నగల మాయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. శ్రీవారి నగలు ఏమయ్యాయో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాత

శ్రీవారి నగల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ నగల మాయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. శ్రీవారి నగలు ఏమయ్యాయో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
 
'కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ను కలవడం జరిగింది. ఆ సందర్భంగా టీటీడీ నగలపై ఆయన కీలకమైన విషయాలను నాకు చెప్పారు. ప్రతిపక్ష నేతలు, టీడీపీ నేతలకు కూడా ఆ విషయం తెలుసు. అతను చెప్పిన దాని ప్రకారం... స్వామివారి నగలు మధ్యప్రాచ్య దేశాలకు ఓ ప్రైవేట్ విమానంలో తరలి వెళ్లాయి. అందువల్లే తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. వేంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారు... ఆయన నగలను దొంగిలించవచ్చని దొంగలు అనుకుంటున్నారు' అంటూ ట్వీట్ చేశారు.
 
అదేసమయంలో పింక్ డైమండ్, ఇతర నగలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని పవన్ అన్నారు. స్వామివారి ఊరేగింపు సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో పింక్ డైమండ్ పగిలిపోయిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో నాణేలు విసిరితే వజ్రం ఎలా పగులుతుందో చేసి చూపించాలని అన్నారు. కాగా, ఈ నగల మాయంపై గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.