మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (17:52 IST)

జనసేన పార్టీకి 4 ల‌క్ష‌ల‌ రూపాయల విరాళం‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాతృమూర్తి

శ్రీమతి కొణెదల అంజనా దేవి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందచేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారంనాడు ఈ మేరకు చెక్కును పార్టీ అధ్యక్షుడు, ఆమె కుమారుడు పవన్ కళ్యాణ్‌కి అందచేశారు. ఈ సందర్భంగా శ్రీమతి అంజనాదేవి తనను కలసిన జనసేన పార్టీ ప్రతినిధులతో మాట్లాడుతూ... పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమ, బాధ్యతతో కూడుకున్నదని అంటువంటి వారి కుటుంబాలకు అండగా నిలవాలని తన కుమారుడు పవన్ కళ్యాణ్‌ను అడిగినట్లు చెప్పారు. ఎందుకంటే పోలీస్ ఉద్యోగం తనకు బాగా తెలుసునని, తన తాతగారు బ్రిటిష్ హయాంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారని, తన తండ్రి ఎక్సయిజ్ శాఖలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసేవారిని చెప్పారు.
 
తన తండ్రిగారి ఉద్యోగం రీత్యా తాము పశ్చిమ గోదావరి జిల్లాకు మారినట్లు తెలిపారు. ఎక్సయిజ్ శాఖలోనే కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీ కొణెదల వెంకట్రావు గారితో తనకు వివాహం అయిందని, ఆ శాఖలో అనేక పదోన్నతులు పొంది అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా వెంకటరావు గారు రిటైర్ అయినట్లు శ్రీమతి అంజనా దేవి గుర్తుచేసుకున్నారు. వెంకట్రావు గారు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసినందువల్లే ఇప్పటికి తనకు పెన్షన్ వస్తుందని, ఆ పెన్షన్ డబ్బుతోనే ఇప్పుడు పార్టీకి నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని అందచేసినట్లు ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
 
పార్టీ కార్యాలయానికి వచ్చిన తన మాతృమూర్తికి పవన్ కళ్యాణ్ పుష్పగుచ్ఛము ఇచ్చి సాదరంగా ఆహ్వానించి ఆమె పాదాలను తాకి నమస్కరించారు. పార్టీ నేత శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీమతి అంజనాదేవికి నమస్కరించగా... ఆయన తండ్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు ఉత్తర్వు కారణంగా తన కుటుంబానికి కలిగిన మేలును గుర్తుచేసుకున్నారు. శ్రీ ఎన్.టి. రామారావు ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 55 సంవత్సరాలకు తగ్గించగా, శ్రీ నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి కాగానే వయోపరిమితిని 58 ఏళ్లకు పెంచారని, దీని కారణంగా తన భర్తకు మరో మూడేళ్ళ పాటు ప్రభుత్వానికి సేవలందించే అవకాశం కలిగిందని, ఇది తమ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగించిందని శ్రీమతి అంజనాదేవి తెలిపారు. 
 
పార్టీ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన శ్రీమతి అంజనాదేవి ఒక గంటసేపు గడిపారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ "ప్రభుత్వోద్యోగి కొడుకుగా నాకు పెన్షన్ విలువ తెలుసు. అందుకే ప్రభుత్వోద్యోగులు సి.పి.ఎస్. విధానం రద్దు కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాను" అన్నారు.