1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (10:16 IST)

'ఉక్కు మనిషి'కి ఘన నివాళి... సమైక్యతా మూర్తికి శిరసెత్తి వందనం

దేశ తొలి ఉపప్రధానమంత్రి, ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు భరత జాతి ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆయన 143వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. 
 
అలాగే, సర్దార్ వల్లాభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన సేవలకు గుర్తుగా నర్మదా నది తీరంలో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం (182 మీటర్లు)గా రికార్డు సృష్టించింది. ఈ విగ్రహాన్ని నర్మద జిల్లా కేవడియా గ్రామం, సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద నిర్మించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉదయం 10 గంటలకు దేశ ప్రజలకు అంకితం చేశారు. 
 
ఈ విగ్రహం పాదాలను నేలపై మోపి.. మేఘాల్లోకి తలెత్తి.. తాను కలలుగన్న భారతావనిని పరికిస్తున్నట్లు ఉండే పటేల్ విగ్రహాన్ని కేవలం 36 నెలల కాలంలో నిర్మించారు. నిర్మాణ వేగం, నాణ్యత, భారీతనంతో కూడిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమే కాకుండా, దేశీయ సాంకేతికత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. 182 మీటర్ల (దాదాపు 600 అడుగులు) ఎత్తుతో రూపొందించిన ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహంగా నిలిచింది. 
 
మరోవైపు, సర్దార్‌ పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. 'బహుశా మోడీకి తెలియదేమో.. బీజేపీకి సొంతంగా చెప్పుకునేందుకు చిరస్మరణీయులైన నేతలెవరూ లేరు. పటేల్‌ కాంగ్రెస్‌వాది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బార్డోలీ సత్యాగ్రహం తరువాత మహాత్మాగాంధీయే స్వయంగా పటేల్‌కు సర్దార్‌ అనే బిరుదునిచ్చారు' అని కాంగ్రెస్‌ ప్రతినిధి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు.