బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (17:01 IST)

పౌరసత్వ చట్టంపై అసత్య ప్రచారం.. చట్టాలను గౌరవించాలి : ప్రధాని మోడీ

పౌరసత్వ సవరణ చట్టంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. పైగా, పార్లమెంట్‌లో చేసిన చట్టాలను కూడా గౌరవించడం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా నిరసలు జరుగుతున్నాయి. 
 
అయితే, బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో అనుకూల ర్యాలీని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, 'సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు ధన్యావాదాలు. మనకు స్వాతంత్ర్యం వచ్చి కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఢిల్లీలోని చాలా మంది ఇప్పటికి భయం, అనిశ్చితి, మోసం, ఎన్నికల్లో ఇచ్చే అసత్య హామీలపై అసంతృప్తితో ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.
 
'ఇక్కడి మెట్రో నాలుగో దశ ప్రాజెక్టును ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం రాజకీయం చేసింది. ఈ ప్రాజెక్టు ఏనాడో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చాలా ఆలస్యమైంది. ప్రజల పేరిట రాజకీయాలు చేస్తున్నవారు ఎప్పటికీ ప్రజల బాధలను అర్థం చేసుకోరు పార్లమెంటులో ఇటీవల సీఏఏ బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యుల నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ప్రజల తీర్పుని గౌరవించాలి' అని మోడీ వ్యాఖ్యానించారు. 
 
భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలమని, అదే దేశ ప్రత్యేకత అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఢిల్లీలోని కొన్ని పార్టీలు తప్పుడు హామీలు ఇస్తూ, ప్రజలను మోసగిస్తున్నాయని, తాము మాత్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఆమ్ ఆద్మీ సర్కార్‌పై మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. వారికి బంగళాలు ఉంటే, తమ వెనుక సామాన్య ప్రజానీకం ఉందని అన్నారు. బంగ్లాలో ఉన్న మిత్రుల కష్టాలనే ఇక్కడి పాలకులు (ఆప్) పట్టించుకుంటున్నారని ఆరోపించారు.