గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (16:09 IST)

రాఫెల్ డీల్ కీలక పత్రాలు చోరీ అయ్యాయి : సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకమైన పత్రాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ డీల్‌ కీలక పత్రాలు రక్షణ శాఖ కార్యాలయంలోనే చోరీకి గురైనట్టు ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.
 
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీస్థాయిలో అవినీతి చోటుచేసుకుందనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అనేక మంది రక్షణ రంగ నిపుణులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాఫెల్ యుద్ధ విమానాల తయారీని ఎంతో అనుభవం ఉన్న హాల్ (హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్)కు అప్పగించకుండా, గత యేడాది పురుడు పోసుకున్న అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌కు అప్పగించారు. దీంతో భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ డీల్‌పై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనల్లో భాగంగా, ఓ నోట్‌లో ఉన్న వివరాలను న్యాయవాది ప్రశాంత్ భూషన్ చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన అంశాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి చోరీకి గురయ్యాయని... దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు. 
 
ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు వీటిని చోరీ చేసి ఉంటారని చెప్పారు. వార్తాపత్రికల్లో ప్రచురితమైన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత కీలకమైనదో ఇటీవల జరిగిన పరిణామాలు చెబుతున్నాయని... వీటిని శల్యపరీక్ష చేయడం వల్ల భవిష్యత్తు కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.