శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (16:17 IST)

అణు యుద్ధానికి సై ... మా వ్యూహాలు మాకున్నాయి : ఐఏఎఫ్ చీఫ్ రాకేశ్

దాయాది దేశం పాకిస్థాన్ నిరంతరం కయ్యానికి కాలు దువ్వుతుందని అయినప్పటికీ తాము దేనికైనా సిద్ధమని ఐఎఎఫ్ చీఫ్ భదౌరియా స్పష్టం చేశారు. కేవలం భూతల యుద్ధానికే కాకుండా అణు యుద్ధానికి సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. 
 
భారత్‌తో అణు యుద్ధానికి సిద్ధమంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నూతన చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ధీటుగా స్పందించారు. అణుయుద్ధానికి మాత్రమే కాదనీ.. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
భారత వైమానిక దళం 26వ దళపతిగా ఆర్.కె.ఎస్.భదౌరియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వాయుసేనాధిపతిగా ఉన్న బీఎస్ ధనోవా పదవీ కాలం సోమవారంతో ముగియడంతో ఆయన స్థానంలో భదౌరియాను కొత్త చీఫ్‌గా ఎంపిక చేయగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'అణ్వస్త్రాల గురించి వాళ్లకు అంతవరకే తెలుసు. కానీమాకంటూ వాటిపై సొంత అవగాహన ఉంది. మా వ్యూహాలు మాకున్నాయి. ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధం' అని ఆయన ప్రకటించారు. 
 
కాగా, ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా భదౌరియా రెండేళ్ల పాటు కొనసాగుతుంది. 1980 జూన్‌లో వాయుసేనలో చేరిన భదౌరియాకు... నాలుగు దశాబ్దాల్లో మొత్తం 4,250 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. తన కెరీర్‌లో ఆయన 26 రకాల విమానాలు నడిపారు. అతి విశిష్ట్ సేవా మెడల్, వాయు సేన మెడల్, పరమ్ విశిష్ట్ సేవా మెడల్ తదితర పతకాల్ని అందుకున్నారు.