ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:42 IST)

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ : తూచ్.. అలాంటిదేం లేదంటున్న అనుచరగణం!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఆయన సొంతంగా ఓ సర్వే కూడా జరిపినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అలాంటిదేం లేదని వాదిస్తున్నారు. మొత్తంమీద రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో సర్వే చేయించినట్టు అనేక మంది బల్లగుద్ది వాదిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అనేక మంది సీనయర్లు రేవంత్ రెడ్డిపై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అదేసమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టకుంటా ఖచ్చితంగా ఆయన సొంత పార్టీని స్థాపించవచ్చనే పలువురు అంటున్నారు. 
 
ఈ ప్రచారంపై రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి స్పందించారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ పెట్టడంపై, అధిష్టానానికి ఆయనపై చేసిన ఫిర్యాదులపై, కేసుల వ్యవహారంపై పెదవి విప్పారు. సీఎం కేసీఆర్‌ వ్యతిరేక శక్తులకు తాను మిత్రుడినని రేవంత్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో కుదురుకోకూడదని కేసీఆర్‌ అనుకూలురు కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  
 
ముఖ్యంగా, 'నాపై కొందరు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకే నాపై కేసులు పెట్టారు. ప్రియాంక గ్రూప్‌లో ఉన్నానని.. రాహుల్‌ గాంధీ పనిచేయడం లేదని అన్నానంటూ నాపై కొందరు దుష్ప్రచారానికి దిగారు. నాపై నెగెటివ్‌ ప్రచారం వర్కవుట్‌ కాలేదు' అని చెప్పుకొచ్చారు. 
 
అంతటితో ఆగని ఆయన.. తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని స్పష్టంచేశారు. కొత్త రాజకీయ పార్టీలు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని, తెలంగాణ ప్రజలు పోరాటం కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు ఆశించిన మేరకు తాము పనిచేయడం లేదన్న భావన ఉందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.