శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (11:23 IST)

పవన్ మనల్ని ఇంతలా డ్యామేజ్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదు : చంద్రబాబు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే విషయాన్ని పదేపదే తన పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావిస్తూ ఆవ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే విషయాన్ని పదేపదే తన పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఇంత డ్యామేజ్ చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో మంగళవారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్‌పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు. 
 
తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని వాపోయారు. 
 
ఇప్పటివరకు నిత్యం వైకాపా నేతలు మన ప్రభుత్వాన్ని, తనను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తూ, ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తుండేవారని, ఇప్పుడు ఆ పార్టీకి బీజేపీ, జనసేన కూడా కలిశాయని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీకి కోవర్టులుగా పవన్, జగన్ పనిచేస్తున్నారని, ఓ అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా దాన్ని నిజం చేయాలన్న వారి ఆలోచనలను ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.