శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (13:21 IST)

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ ఊళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని మెట్రో వేళలను సవరించారు. శనివారం నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. 
 
తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ అన్ని యూనియన్లు కలసికట్టుగా సమ్మెకు దిగాయి. మరోవైపు, ప్రజల సౌకర్యార్థం కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఈ బస్సులను పోలీసుల బందోబస్తుతో నడుపుతోంది. 
 
ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్‌కు వస్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... బస్సుపై రాళ్లు రువ్వారు. 
 
ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ... మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.