శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 21 జులై 2018 (11:56 IST)

మనుషులను చంపే ఒక కసాయి ఈ దేశాన్ని పాలిస్తున్నారు.. మోడీపై సేన ధ్వజం

ప్రస్తుతం బీజేపీ - శివసేనల మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో శివసేన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

ప్రస్తుతం బీజేపీ - శివసేనల మధ్య జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో శివసేన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. జంతువులను కాపాడుతూ, మనుషులను చంపే ఒక కసాయి ఈ దేశాన్ని పాలిస్తున్నారంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి సాఘాటైన వ్యాఖ్యలు చేసింది.
 
దేశాన్ని పాలిస్తున్న వారిలో కనీస దయ, జాలి కూడా లేకుండా పోయాయని మండిపడింది. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉండటం కాదని, మెజారిటీ అనేది తాత్కాలికం మాత్రమేనని... ఎప్పటికైనా ప్రజలే సుప్రీమ్ అని గుర్తు చేసింది. మరోవైపు బీజేపీతో తెగతెంపులు చేసుకునే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని శివసేన నేతలు ఘంటా పథంగా చెబుతున్నారు. 
 
శుక్రవారం లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపీలంతా సభకు హాజరుకావాలని శివసేన విప్ జారీ చేసింది. బీజేపీ నేతల కోరిక మేరకే ఈ విప్ జారీ అయింది. కానీ ఇంతలోనే శివసేన అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చింది. చివరకు లోక్‌సభకు నిన్న శివసేన దూరంగా ఉండిపోయింది. బీజేపీ అగ్రనేతలు అనుసరిస్తున్న తీరు పట్ల శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే గుర్రుగా ఉన్నట్టు సమాచారం.  
 
ముఖ్యంగా, ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తామని ప్రకటించిన శివసేన చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన అసలు చర్చనుంచే దూరంగా ఉండిపోయింది. చివరి క్షణాల్లో నిర్ణయం మారడంపై మీడియా ముందు శివసేన పార్టీ నేతలు స్పందిస్తూ, నిన్నటి సంగతులు వదిలేయండి, ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాట్లాడండి అంటూ సమాధానం ఇచ్చారు.
 
బీజేపీతో శివసేన గతకొంతకాలంగా ఘర్షణపూరితమైన వైఖరిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభకు దూరంగా ఉన్న శివసేన మరోవైపు.. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్‌సభలో మోడీ సర్కారు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే లోక్‌సభకు తాము గైర్హాజరయ్యాయమని శివసేన నేతలు చెప్తుండగా.. శివసేన అధికార పత్రిక సామ్నా బీజేపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది.