శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వాసు
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (16:16 IST)

డీఎంకే గుర్తు ఉదయ సూర్యుడు... దాన్ని కూడా మూసేస్తారా?

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు... ఎన్నికల కోడ్‌లు వాటి ఉల్లంఘనల కింద పేద ప్రజల కడుపుల మీద కొట్టేందుకు అధికారులు సిద్ధమైపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కి దగ్గర్లో మాంద్యా నగరంలో ఉన్న జ్యోతిష్యుల ఇళ్లకు దాదాపు 12 మంది ఎన్నికల సంఘం అధికారులు హుటాహుటిన వెళ్లి... అక్కడ కనిపించే హస్తం గుర్తులన్నింటినీ మూసివేయించారు. 
 
అదేమని అడిగితే... హస్తసాముద్రిక గుర్తులు ఎన్నికల గుర్తైన హస్తం (కాంగ్రెస్ పార్టీ గుర్తు)ను పోలి ఉన్నాయని సమాధానం రావడంతో ఒళ్లు మండిన జ్యోతిష్యులు, మరి తమిళనాడు డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడు కదా... సూర్యుణ్ని కూడా మూసేస్తారా అని ప్రశ్నించడంతో ఈసీ అధికారులు తెల్లమొహాలు వేసారట. లోక్‌సభ ఎన్నికలు జ్యోతిష్యుల పొట్ట కొడుతున్నాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. 
 
మాండ్యా పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం ఇలాగే హస్తసాముద్రికలను మూసివేస్తామని ఈసీ అధికారులు జ్యోతిష్య పండితులకు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆ గుర్తును మూసివేసి ఉంచాలనీ, లేదంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసేసారు.
 
మోడల్ కోడ్ అమల్లోకి తేవడం తప్పుకాదు... కానీ అర్థం లేని నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదని అన్నారు కర్ణాటక కాంగ్రెస్ నేత మిలింద్ ధర్మసేన. ఈసీ నిర్ణయాలు లాజికల్‌గా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరారు. కాగా... స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుపోతామని అంటున్నారు. 
 
అయితే... తామరపూలు, ట్రాక్టర్, సైకిల్, టార్చ్, ఫ్యాన్, ఏనుగులు, హ్యాండ్ పంపులు, రెండు ఆకులు ఇలా ఎన్నో వస్తువులు... పార్టీ గుర్తులను పోలి ఉంటున్నాయిగా... మరి వాటన్నింటిని కూడా అధికారులు మూసివేయిస్తారా అని అడుగుతున్న జ్యోతిష్యుల ప్రశ్నలకు మాత్రం ఈసీ అధికారుల దగ్గర సమాధానం ఉండడం లేదు.