మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (11:08 IST)

సినిమాకు తక్కువ.. ఇంటర్వెల్‌‌కు ఎక్కువ... పవన్ కళ్యాణ్‌పై జగన్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారంటూ నిలదీశారు. తాము హోదాతో వచ్చే ప్రయోజనాలను ప్రజలందరికీ వివరించి చైతన్య పరుస్తుంటే.. జనసేన అధినేత నాలుగేళ్లుగా ఏం చేశారని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నాలుగేళ్లపాటు యువభేరీలు, సదస్సులు, దీక్షలు చేపట్టి హోదా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియచేశామని గుర్తు చేశారు. ముఖ్యంగా, ప్రత్యేక హోదా కోసం పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు ఏ ధర్నాలు, దీక్షలు, కార్యక్రమాలు చేపట్టారని నిలదీశారు. అప్పుడప్పుడు ట్వీట్‌ చేస్తారని అదీ లేకపోతే ప్రెస్‌మీట్‌లు పె‍ట్టి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేవారంటూ గుర్తుచేశారు. 
 
నిజం చెప్పాలంటే 'సినిమా తక్కువ.. ఇంటర్వెల్‌ ఎక్కువ' అన్న చందంగా పవన్‌ తీరు ఉందని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు, బీజేపీతో జతకట్టిన పవన్‌, వారికి ఓటు వేయమని అడగలేదా అంటూ ప్రతిపక్షనేత నిలదీశారు. నాలుగేళ్ల తర్వాత ఉనికి కోసం బీజేపీ, చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచారని అంటున్నారని, అదే మేధావి పవన్‌ తీరు అని మండిపడ్డారు.
 
ప్రత్యేక  హోదా బదులు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారని, ఆ రోజే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఇన్నాళ్లు పార్టనర్‌ చంద్రబాబుకు సపోర్టు చేసిన పవన్‌ ఇప్పుడు ఏవిధంగా ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.