బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (09:16 IST)

బిగ్ మండే : పక్కా వ్యూహంతో టీడీపీ అవిశ్వాసం... సభలో అల్లర్లకు కేంద్రం ప్లాన్

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సోమవారం మరోమారు పార్లమెంట్‌ను షేక్ చేయనున్నారు. కేంద్రంపై శుక్రవారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో టీడీపీ, వైకాపా పార్టీలే వేర్వేరుగా మరోసారి తీర్మానం నోటీ

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సోమవారం మరోమారు పార్లమెంట్‌ను షేక్ చేయనున్నారు. కేంద్రంపై శుక్రవారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో టీడీపీ, వైకాపా పార్టీలే వేర్వేరుగా మరోసారి తీర్మానం నోటీసులు ఇచ్చాయి. టీడీపీ తరపున తోట నరసింహం.. వైకాపా నుంచి వైపీ సుబ్బారెడ్డిలు ఈ నోటీసులు అందించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో టీడీపీ విఫలమైందన్న సుబ్బారెడ్డి.. హోదా విషయంలో కేంద్రం కూడా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. హోదా కోసం.. నిధుల కోసం కేంద్రంపై కచ్చితంగా పోరాడతామని చెప్పారు.
 
ఇకపోతే టీడీపీ, వైకాపాలు మళ్లీ ఇచ్చిన తీర్మాన నోటీసులపై.. సోమవారం సమావేశంలో స్పీకర్ సుమిత్రా తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. అవిశ్వాసానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్ వాదీతో పాటు... కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది. దీంతో తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన మద్దతు విషయంలో కూడా ఎలాంటి సమస్య ఉండదని ఏపీ ఎంపీలు భావిస్తున్నారు
 
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగు దేశం పార్టీ అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహంతో ముందుకుసాగుతున్నారు. అవిశ్వాసంపై తామిచ్చిన నోటీసుపై లోక్‌సభలో చర్చకు వచ్చేలా ఉడుంపట్టు పట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. వాయిదాల పర్వంతో కాకుండా పక్కా వ్యూహంతో ఇరుకున పెట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. 
 
ఇందుకోసం పక్కాగా ప్రణాళికతో ఇప్పటికే 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించింది. సభ ప్రారంభంకావడంతోనే లోక్‌సభ స్పీకర్‌కు మరోసారి నోటీసు ఇవ్వనుంది. కేంద్రం అల్లరి చేయించి సభ వాయిదా వేయాలని చూస్తే రచ్చ చేయాలని భావిస్తోంది. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు ఉధృతం చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎట్టి పరిస్థితిల్లోనూ వెనక్కి తగ్గొద్దని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పార్టీ ఎంపీలకూ విప్‌ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ ఎంపీలందరూ హాజరుకావాలని ఆదేశించింది.