శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By JSK
Last Modified: సోమవారం, 18 జులై 2016 (15:48 IST)

6 ఏళ్ల సర్వీస్... 9 ట్రాన్స్ఫర్లు... 'గుంటూరు' పల్లవి పేరంటే కర్నాటక నాయకులకు హడల్...

కర్ణాటకలో ఈ పేరు ఓ సంచలనం. నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్ ఆమె. “2009 బ్యాచ్. కర్ణాటక కేడర్. 6 సంవత్సరాల సర్వీస్. 9 ట్రాన్స్ఫర్లు. ఆమె గుంటూరు జిల్లాకు చెందిన ఆకురాతి ప‌ల్ల‌వి. పల్లవి ఎక్కడా రాజీపడకుండా బతికింది. అలానే ఉద్యోగం చేస్తోంది. ఈ 33 ఏళ్ల యువతి అంటే

కర్ణాటకలో ఈ పేరు ఓ సంచలనం. నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్ ఆమె. “2009 బ్యాచ్. కర్ణాటక కేడర్. 6 సంవత్సరాల సర్వీస్. 9 ట్రాన్స్ఫర్లు. ఆమె గుంటూరు జిల్లాకు చెందిన ఆకురాతి ప‌ల్ల‌వి. పల్లవి ఎక్కడా రాజీపడకుండా బతికింది. అలానే ఉద్యోగం చేస్తోంది. ఈ 33 ఏళ్ల యువతి అంటే కర్ణాటకలోని నాయకులకు మంట, భ‌యం. పల్లవి పనితీరు గురించి చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఆమె ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ ఘటన జరిగింది. కర్ణాటకలో ఇంటర్ పేపర్లు లీక్ అవడం అక్కడ మామూలు విషయం. 
 
పల్లవి బోర్డు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆమె వాట్స్‌యాప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆరోజు జరగాల్సిన కెమిస్ట్రీ పేపర్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్ రాయాల్సిన ఓ కుర్రాడు పంపిన మెసేజ్ అది. వాట్సప్ చూసి లైట్ తీసుకోలేదు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. మళ్లీ ఎగ్జామ్ పెట్టారు. కామెడీ ఏంటంటే, రీ-ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయింది. అక్కడ ఎగ్జామ్ మాఫియా ఎంత బలంగా ఉందో, ఇంటర్ బోర్డు వాళ్లు ఆ మాఫియాకు ఏ రేంజ్‌లో సహకరిస్తున్నారో అప్పుడు అర్థమైంది పల్లవికి. వాళ్లే మొండి అయితే పల్లవి జగమొండి. 
 
మళ్లీ రెండో ఎగ్జామ్ కూడా రద్దు చేసారు. దీంతో మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా పల్లవి తగ్గలేదు. కేసు నమోదు చేసి, విచారణ సిఐడికి అప్పగించారు. విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ పేపర్ లీకేజ్ ముఠాలు వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు చేస్తున్నాయి. పల్లవి పుణ్యమా అని వాళ్ల గుట్టు రట్టయింది. ఎండోమెంట్ కమీషనర్‌గా పల్లవి విజయాలు కూడా చాలా ఫేమస్. తను దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన దేవాదాయ ఆస్తులను కాపాడారు. 
 
ఓ మైనారిటీ మ‌హిళ శోకం తీర్చేందుకు....
 
సకలేశ్‌పూర్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు ఓ ముస్లిం మహిళ పొలానికి వెళ్లే దారిని ఒకడు ఆక్రమించుకుంటే ఆమె విడిపించారు. ఆ తరువాత పల్లవి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోతుంటే.. ఆ మహిళ వచ్చి పల్లవి చేతులు పట్టుకుని ఏడ్చేసిందట. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంటారు పల్లవి. తెలుగు మీడియంలో ఐఎఎస్ పాస్ అయిన మొదటి మహిళ ఆకురాతి పల్లవే. గుంటూరు జిల్లాకు చెందిన పల్లవి సివిల్స్‌లో 101వ ర్యాంకు సాధించింది. పల్లవి మూడుసార్లు సివిల్స్ పాసయింది. కచ్చితంగా ఐఎస్ మాత్రమే కావాలని పట్టుదలతో మూడోసారి ర్యాంక్ కొట్టింది. 
 
ఐఎఎస్ ప్రిపరేషన్‌కి పల్లవికి 8 సంవత్సరాలు పట్టింది. దానికి ప్రత్యేక కారణం ఉంది. చిన్నప్పటి నుంచీ తెలుగు మీడియంలోనే చదివింది.తెలుగు మీడియంలో, గవర్నమెంటు స్కూళ్లలో చదివినా ఐఎఎస్ సాధించడానికి ఇబ్బంది కాదని నిరూపించడానికి పల్లవి ఓ ఉదాహరణ. పుస్తకాల పురుగుల్లా ఉంటేనే ఐఎఎస్ అవుతారని చాలా మంది అనుకుంటారు. కానీ పల్లవిలో మాత్రం చాలా కళలు ఉన్నాయి. ఆమె ఒక కూచిపూడి డాన్సర్, తెలుగు కవయిత్రి. శ్లోకాలు రాగయుక్తంగా పాడతారు. 
 
పెయింటింగ్ తన హాబీ. ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, అరచేతిలో గోరింటాకు పెట్టడం, బట్టల ఎంబ్రాయిడరీలో దిట్ట. ఉద్యోగం కాకుండా అంతకుమించిన సేవ కూడా చేస్తోంది. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే వారికి ఉచితంగా శిక్షణ ఇస్తుంది. పేద అమ్మాయిలకు తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి కోచింగ్ ఇస్తోంది. పల్లవి పెళ్లి చాలా సింపిల్‌గా ఓ గుడిలో సంప్రదాయం ప్రకారం జరిగింది. గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ఇద్దరు పేద పిల్లలను చదివిస్తున్నారు.