1. వార్తలు
  2. »
  3. తెలుగు వార్తలు
  4. »
  5. తెలుగు వార్తలు
Written By PNR

బ్లడ్‌ బ్యాంక్‌పై మాట్లాడితే నాలుక కోస్తా: అల్లు అరవింద్

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నెలకొల్పిన రక్తనిధి బ్యాంకు (బ్లండ్ బ్యాంకు) గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి నాలుక కోస్తానని ప్రజారాజ్యం పార్టీ నేత, సినీ నిర్మాత అల్లు అరవింద్ హెచ్చరించారు. గతంలో ఎవరో ఏవేవో విమర్శలు చేశారు.. అది ఎన్నికల సమయం కాబట్టి అన్నింటికీ సహించామన్నారు. ఇపుడు నోటికొచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. వారి నాలుక కోస్తానని అన్నారు.

తమ పార్టీ అధినేత చిరంజీవిపై సినీ నటులు రాజశేఖర్, జీవితలు చేసిన విమర్శలపై సోమవారం రాత్రి ఆయన స్పందించారు. చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి నాలుక కోస్తానన్నారు. చిరంజీవి రాచబాటలో వెళ్లే గజరాజు వంటివారు. దారిన పోయే చాలామంది వీధి కుక్కల్లా మొరుగుతుంటారన్నారు.

రాజశేఖర్, జీవితల వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. వారి స్థాయిక తగిన నేతలు తమ పార్టీలో ఉన్నారని వారే స్పందిస్తారన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రరాపా మహిళా నేత శోభారాణిని చూపిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా, ఎన్నికల సమయంలో బ్లడ్‌బ్యాంక్ గురించి ఎవరైన్ని మాట్లాడినా ఓపిక పట్టాలని అభిమానులకు, నేతలకు తామే స్వయంగా చెప్పాం. ఇప్పుడు ఎన్నికలు లేవు. పిలిస్తే వచ్చే ఛానళ్లు ఉన్నాయి కదా అని ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తానన్నారు.

చిరుపై చేసిన వ్యాఖ్యలకుగాను రాజశేఖర్, జీవితలపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. కాంగ్రెస్‌లో వారి స్థానమేమిటో తెలియని వీరు.. వేరొకరి జీతగాళ్లుగా మారి ఇలా మాట్లాడుతున్నారన్నారు.